టాటా గ్రూప్ టాప్ పోస్ట్ మిస్త్రీదే: NCLAT తీర్పు, ఇది నా గెలుపు కాదు.. సైరస్ ట్వీట్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని మళ్లీ నియమిస్తున్నట్లు నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT) ప్రకటించింది. దాదాపు మూడేళ్ల తర్వాత మిస్త్రీ మళ్లీ ఆ పదవిని చేపట్టే అవకాశముంది. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ నియామకాన్ని NCLAT నిలుపుదల చేసింది. చంద్రశేఖరన్ నియామకం చట్ట విరుద్ధమని కోర్టు పేర్కొంది.
అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్స్
2016 అక్టోబర్ 24వ తేదీన సైరస్ మిస్త్రీని తొలగించారు. కార్పోరేట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా తనను తొలగించారని ఆరోపిస్తూ న్యాయపోరాటం ప్రారంభించారు. అదే ఏడాది డిసెంబర్ 19న టాటా గ్రూప్ అన్ని సంస్థల డైరెక్టర్గా మిస్త్రీ రాజీనామా చేశారు. అదే నెలగ 20 తేదీన NCLATను ఆశ్రయించారు. ఎన్ చంద్రశేఖరన్ 2017 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టారు.
సైరస్ మిస్త్రీని తొలగించడం చట్ట విరుద్ధమని NCLAT తాజాగా పేర్కొంది. ఆయనకు సంబంధించిన పునర్నియామక ఉత్తర్వులు నాలుగు వారాల తర్వాత అమలులోకి వస్తాయి. ఈ లోపు టాటా సంస్థ అప్పీల్ చేసుకోవచ్చునని కూడా NCLAT తెలిపింది.
తీర్పు తనకు అనుకూలంగా రావడంపై సైరస్ మిస్త్రీ స్పందించారు. ఈ రోజు వచ్చిన జడ్జిమెంట్ వ్యక్తిగతంగా తన గెలుపు మాత్రమే కాదని, గుడ్ గవర్నెనస్ ప్రిన్సిపుల్స్, మైనార్టీ షేర్ హోల్డర్స్ హక్కుల విజయమని మిస్త్రీ పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక తీర్పు అన్నారు.