Cyber Crimes: వేల కోసం ఆశపడితే లక్షలు దోచేశారు.. RBI పేరుతో సైబర్ మోసాలు.. జాగ్రత్త మరి..
Fishing Fraud: ప్రస్తుత సాంకేతిక యుగంలో నేరగాళ్లు ప్రజలను సులువుగా మోసం చేస్తున్నారు. అందువల్ల సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఉంచుకోవటం అత్యంత కష్టంగా మారుతోంది. బ్యాంకులో ఉంటే డబ్బు భద్రంగా ఉంటుందని అనుకోవటం ఒకప్పటి మాట. కానీ.. సైబర్ మాయగాళ్లు ఫిషింగ్ సహా వివిధ పద్ధతులను ఉపయోగించి ప్రజల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బువు ఖాళీ చేసేస్తున్నారు. దేశంలోని బ్యాంకులు, రిజర్వు బ్యాంక్ వీటిపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంచా చాలా మంది తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటూనే ఉన్నారు.
బహుమతులు ఆశ చూపి..
మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన ఓ సీనియర్ సిటిజన్ తాజాగా సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి కష్టపడి దాచుకున్న డబ్బును పోగొట్టుకున్నాడు. ఆర్బీఐ నుంచి కాల్ చేస్తున్న అధికారులమంటూ 62 ఏళ్ల నీలం సింగ్కు కాల్ చేశారు. ఆ కాల్లో మాట్లాడిన వ్యక్తి నీలం సింగ్కు.. రూ.7,250 బహుమతి వచ్చిందని, ఆ బహుమతి పొందడానికి వారు పంపిన లింక్పై క్లిక్ చేయాలని చెప్పారు. దీనిని నమ్మిన సదరు వ్యక్తి రూ.2.20 లక్షలను పోగొట్టుకున్నాడు.
క్షణాల్లో కొట్టేశారు..
ఈ విధంగా పంపిన లింక్లను క్లిక్ చేయవద్దని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్తో పాటు దేశంలోని అనేక బ్యాంకులు అవగాహన కల్పించినప్పటికీ నీలమ్ సింగ్ అత్యాశతో లింక్ను క్లిక్ చేశారు. మరుసటి నిమిషంలో.. రిజర్వ్ బ్యాంక్ అధికారి అంటూ కాల్ చేసిన నిందితులు బాధితుడి క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.2.20 లక్షల ఆన్లైన్ లావాదేవీని చేశారు.
పోలీసులకు ఫిర్యాదు..
దీంతో షాక్కు గురైన నీలం సింగ్ వెంటనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఈ తరహా మోసాలు భారీగా పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనవసరమైన, గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింక్స్ పై క్లిక్ చేయవద్దని వారు అంటున్నారు.
రిజర్వ్ బ్యాంక్..
మీరు బహుమతిని గెలుచుకున్నారు, మీ ఖాతాకు ప్రత్యేక బహుమతి లభించి అంటూ వలవేసే ఫిషింగ్ స్కామర్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిస్తోంది. బ్యాంకులు ఎప్పుడూ వినియోగదారులకు కాల్స్ చేయవని, వారి అకౌంట్లకు సంబంధించిన సున్నితమైన వివరాలను అడగదని గమనించాలి.
అత్యాసకు పోవద్దు..
దేశంలో చాలా ఆన్లైన్ దొంగతనాలు ఫిషింగ్ ద్వారా జరుగుతాయని నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల చాలా మంది ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బను ఉచిత తాయిలాల ఆశతో పోగొట్టుకోవద్దని బ్యాంకులు సూచిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కేసుల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాటిపై అవగాహన పెంచుకుని, మోసగాళ్ల మాయమాటలకు బలికాకుండా రక్షణ పొందాల్సిన సమయం వచ్చింది.