ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్: నిరంతర బ్యాంకింగ్ సేవలకు ఇలా చేయండి
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు ఓ సూచన చేసింది. పర్మినెంట్ అకౌంట్ నెంబర్(PAN) - ఆధార్ను లింక్ చేసుకోవాలని సూచించింది. ఎప్పటిలాగే నిరంతర బ్యాంకింగ్ సేవలను పొందడానికి వెంటనే పాన్-ఆధార్ లింక్ పూర్తి చేయాలని పేర్కొంది. ఒకవేళ లింకింగ్ పూర్తి చేయకుంటే పాన్ కార్డు పని చేయకుండా పోతుందని స్పష్టం చేసింది. అలాంటి కార్డులను ట్రాన్సాక్షన్ సమయంలో పొందుపరచవద్దని విజ్ఞప్తి చేసింది. ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే వెంటనే పాన్-ఆధార్ లింకింగ్ పూర్తి చేయాలని సూచించింది.
కరోనా నేపథ్యంలో పాన్-ఆధార్ అనుసంధానం గడువును కేంద్రం 2022 మార్చి 31 వరకు పొడిగించింది. సాధారణ బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్ ఖాతా తెరవాలన్నా, నగదు జమ చేయాలన్నా పాన్ తప్పనిసరి. పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు ఇన్కం ట్యాక్స్ వెబ్ సైట్లోకి వెళ్లి అనుసంధానం చేసుకోవచ్చు.
అలాగే, సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్దారుల డిజిటల్ ట్రాన్సాక్షన్స్కు సంబంధించి ఎస్బీఐ మరో ప్రకటన చేసింది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలిపింది. రూపే డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ పైన 2020 జనవరి 1వ తేదీ నుండి ఈ సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. 2017-2020 మధ్య జన్ ధన్ అకౌంట్స్ నుండి ఎస్బీఐ రూ.254 కోట్లు వసూలు చేసిందని, ఇందులో రూ.90 కోట్ల మేర కస్టమర్లకు రీఫండ్ చేసినట్లు తెలిపింది. సీబీడీటీ ఆదేశాలతో 2020 జనవరి 1వ తేదీ నుండి 2020 సెప్టెంబర్ 14వ తేదీ వరకు వసూలు చేసిన మొత్తం రీఫండ్ చేసినట్లు తెలిపింది.