పార్లమెంట్ సమావేశాల్లో క్రిప్టో బిల్లు: భారీగా క్షీణించిన బిట్ కాయిన్, ఎలానమిక్స్ 600% జంప్
శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లుతో పాటు మొత్తం 29 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. ది క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021 పేరుతో దీనిని ప్రవేశ పెట్టనున్నది కేంద్రం. ఆస్ట్రేలియా వేదికగా ఇటీవల జరిగిన వర్చువల్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ 'ఇండియా టెక్నాలజీ:ఎవల్యూషన్ అండ్ రెవల్యూషన్' అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. ఇందులో భాగంగా క్రిప్టో కరెన్సీపై మాట్లాడారు. చెడ్డవారి చేతుల్లోకి క్రిప్టో వెళ్లకుండా ప్రపంచ దేశాలు కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. డిజిటల్ కరెన్సీపై తమ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, త్వరలో ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. మరోవైపు, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన క్రిప్టో డ్రాఫ్ట్ పైన చర్చించారు. ఇప్పుడు బిల్లు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
క్రిప్టోను నిషేధించాలని 2019లో నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ అభిప్రాయంతో పాటు వివిధ సంస్థలు, వ్యక్తులు పెట్టిన పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని, కొన్ని పరిమితులతో క్రిప్టోను అనుమతించాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రిప్టో బిల్లుకు ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఆఫీసర్లు తుదిమెరుగులు దిద్దుతున్నారు. శీతాకాలపు పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 29వ తేదీన ప్రారంభమవుతున్నాయి. ఫాస్ట్ ట్రాక్ విధానంలో క్రిప్టో బిల్లుకు ఆమోదం పొందాలని కేంద్రం యోచిస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
క్రిప్టోను కట్టడి చేసేందుకు, వాటిల్లో ఇన్వెస్ట్ పెట్టుబడి పెట్టకుండా నిరుత్సాహపరిచేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకు నిబంధనలను కఠినతరం చేయనుంది. క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయాలని భావించేవారు ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కావడానికి, ట్రేడింగ్కు ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుందని చెబుతున్నారు. ముందస్తు వెరిఫికేషన్ నిబంధన వల్ల ఒక సంస్థ నుండి మరో సంస్థకు, ఇన్వెస్టర్ల మధ్య ట్రాన్సాక్షన్కు అడ్డంకులు ఏర్పడతాయి. ప్రభుత్వ అప్రూవల్ పొందిన క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాలి. అలా కాకుండా ప్రభుత్వ అనుమతిలేని క్రిప్టోల్లో పెట్టుబడి పెడితే మాత్రం పెనాల్టి ఉంటుందని సమాచారం. క్రిప్టోల్లో పెట్టుబడి ద్వారా వచ్చే లాభాల పైన 40% పైన పన్ను చెల్లించవలసి ఉంటుందని తెలుస్తోంది.
క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ
క్రిప్టో కరెన్సీ క్రితం సెషన్లో భారీగా క్షీణించింది. నేడు మాత్రం లాభపడింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్తో పాటు ఎథేరియం భారీగా నష్టపోయింది. బిట్ కాయిన్ 60వేల డాలర్ల దిగువకు పడిపోయింది. నేడు కాస్త పెరిగినప్పటికీ ఇప్పటికీ 58,000 డాలర్లకు దిగువనే ఉంది. బిట్ కాయిన్ గత వారం రోజుల్లో 6 శాతానికి పైగా క్షీణించింది. బిట్ కాయిన్ వ్యాల్యూ నిన్న ప్రారంభంలో 60వేల డాలర్లకు పైనే ఉన్నప్పటికీ ఆ తర్వాత భారీగా పడిపోయి 57,000 డాలర్ల స్థాయికి వచ్చింది. బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్లు.
ఎథేరియం 4178 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత వారం రోజుల్లో 3 శాతం మేర క్షీణించింది. బియాన్స్ కాయిన్ 565.73 డాలర్ల వద్ద ఉంది. ఏడు సెషన్లలో 6 శాతానికి పైగా తగ్గింది. డిజిటల్ టోకెన్స్ షిబా ఫ్లోకి ట్రిలియనీర్, మార్స్ స్పేస్ ఎక్స్, ఎలానమిక్స్ భారీగా లాభపడ్డాయి. షిబా ఫ్లోకి ట్రిలియనీర్ 3,788.61 శాతం ఎగిసి 0.0000118 డాలర్లకు, ఎలానమిక్స్ 618 శాతం, మార్స్ స్పెస్ ఎక్స్ 707 శాతం లాభపడ్డాయి.