క్రిప్టో కొత్త బిల్లు త్వరలో పార్లమెంటుకు: నిర్మలా సీతారామన్
కేంద్ర ప్రభుత్వం కొత్త క్రిప్టో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం అన్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో క్రిప్టో కరెన్సీ పైన గతంలోని బిల్లును వెనక్కు తీసుకున్నట్లు తెలిపారు. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో కొత్త క్రిప్టో బిల్లును తీసుకు వస్తామని స్పష్టం చేశారు. NFTs(నాన్-ఫంగిబుల్ టోకెన్) రెగ్యులేషన్స్ పైన కూడా కేంద్రం చర్చిస్తుందన్నారు.
'పార్లమెంటులో బిల్లు తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యాం. కేబినెట్లో ఇది ఓసారి అప్రూవ్ అయ్యాక దీనిని హౌస్లో ప్రవేశపెడతాం' అని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుతం ఈ అడ్వైర్టైజ్మెంట్స్ను తాను బ్యాన్ చేయడం లేదన్నారు. అయితే ఆర్బీఐ, సెబి ద్వారా చైతన్యపరిచేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. క్రిప్టో కరెన్సీ పైన పన్ను ఉంటుందా, ఉంటే ఎంత ఉంటుందనే విషయానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదన్నారు.
టాప్ టెన్లోని 9 క్రిప్టో కరెన్సీలు నేడు లాభపడ్డాయి. బిట్ కాయిన్, ఎథేరియం ఏడు శాతం చొప్పున లాభపడగా, పోల్కాడాట్ 10 శాతం ఎగిసింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.46 ట్రిలియన్ డాలర్లుగా నమోదయింది. అయితే క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 4 శాతం తగ్గి 101.58 బిలియన్ డాలర్లుగా ఉంది. తొలుత లాభపడిన బిట్ కాయిన్ ఆ తర్వాత క్షీణించింది. బిట్ కాయిన్ 0.35 శాతం, కార్డానో 0.55 శాతం నష్టపోయాయి. ఎథేరియం 3.1 శాతం, బియాన్స్ కాయిన్ 1.65 శాతం, టెథెర్ 1.52 శాతం, ఎక్స్ఆర్పీ 2.19 శాతం, యూఎస్డీ కాయిన్ 0.07 శాతం, పోల్కాడాట్ 0.36 శాతం, డోజీకాయిన్ 9.73 శాతం లాభపడ్డాయి.