కోవిషీల్డ్ ధరను తగ్గించిన సీరం సంస్థ : రాష్ట్రాలకు ఆ ధర , సిఈఓ అదార్ పూనవల్లా ట్వీట్
ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారు అయిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తమ కరోనా నివారణ టీకాలలో ఒకటైన కోవిషీల్డ్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఈఓ అదార్ పూనవల్లా బుధవారం తన కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ యొక్క రాష్ట్రాల ధరను రూ. 400 నుండి రూ.300కు తగ్గించినట్లు ప్రకటించారు.
ఆక్సిజన్ సరఫరాలో మేము సైతం: ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఆక్సిజన్ రవాణాతో రంగంలోకి దిగిన ఐటీసీ
రాష్ట్రాలకు విక్రయించే కోవిడ్ వ్యాక్సిన్ ధర తగ్గించిన సీరం సంస్థ .. ట్వీట్ చేసిన పూనవల్లా
ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేసిన పూనవల్లా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తరపున తాము ఒక పరోపకారం చేస్తున్నామని, రాష్ట్రాలకు ఇచ్చే కోవిడ్ వ్యాక్సిన్ ధరను మోతాదుకు రూ .400 నుండి రూ .300 కు తగ్గించామని , ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇది వేలాది కోట్ల రాష్ట్ర నిధులను ఆదా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాలలో ఎక్కువ టీకాలు వేయడానికి మరియు భారీ సంఖ్యలో ప్రజల ప్రాణాలను కాపాడడానికి వీలవుతుందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
తగ్గించిన ధరలు అందుబాటులోకి వస్తాయని ప్రకటన
ప్రైవేట్ ఆస్పత్రులకు ధర మాత్రం 600 రూపాయలుగా నిర్ణయించిన విషయం తెలిసిందే, అయితే ఈ ధర విషయంలో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు.కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ఆయన, తగ్గింపు ధరలు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయని స్పష్టం చేశారు. భారత్ బయోటెక్ తన కోవిడ్ -19 వ్యాక్సిన్, కోవాక్సిన్ ధరను రాష్ట్ర ప్రభుత్వాలకు మోతాదుకు 600 రూపాయలు మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు మోతాదుకు 1,200 గా నిర్ణయించింది. రెండు టీకాలు కేంద్ర ప్రభుత్వానికి మోతాదుకు 150 రూపాయల చొప్పున ఇస్తున్నాయి.
వ్యాక్సిన్ ధరల వ్యత్యాసంపై పెరిగిన ఒత్తిడితో తాజా నిర్ణయం
కరోనా వ్యాక్సినేషన్ మూడవ దశ మే 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, అందరికీ వ్యాక్సినేషన్ కు కేంద్రం ప్లాన్ సిద్ధం చేసింది. ఈ సమయంలో సీరం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలను నిర్ణయిస్తూ సీరం సంస్థ ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వందల రూపాయలు, ప్రైవేట్ ఆసుపత్రులు ఆరు వందల రూపాయల చొప్పున విక్రయించనున్నట్లుగా సీరం సంస్థ పేర్కొంది. ఇక వ్యాక్సిన్ ధరల వ్యత్యాసంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి.
రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్ ధరలను రూ. 400 నుండి రూ.300కు తగ్గించిన సంస్థ
ఒకే దేశం ఒకే వ్యాక్సిన్ విధానమంటూ ధరల విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ క్రమంలో తాజాగా సీరం సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించే వ్యాక్సిన్ ధరలను తగ్గిస్తున్నామని పేర్కొంది. ఇది ఒకింత రాష్ట్రాలకు ఊరటనిచ్చే అంశమే అయినా, కేంద్రం ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోకపోవడం, తాజాగా సీరం సంస్థ చేసిన ప్రకటన కేవలం 100రూపాయలు తగ్గించటం కంటితుడుపు చర్యగా భావిస్తున్నాయి వివిధ రాష్ట్రాలు.