కరోనా టీకా ఉత్పత్తి పెంపుకు కేంద్రం కీలకచర్య! ఆ సంస్థలకు రుణం మంజూరు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో టీకాల ఉత్పత్తి పెంచే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. టీకా తయారీ సంస్థలు అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకునేందుకు రుణాలు మంజూరు చేసింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా టీకా కొవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తోన్న సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII)కు కేంద్రం రూ.3వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. అలాగే దేశీయంగా కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తోన్న భారత్ బయోటెక్కు రూ.1500 కోట్ల రుణం మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థలకు నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
టీకా ఉత్పత్తి నెలకు 100 మిలియన్లు మించాలంటే తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించాల్సి ఉంటుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా అన్నారు. అందుకు సీరం సంస్థకు రూ.3,000 కోట్ల రుణం కావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం రుణం మంజూరు చేసింది. జూన్ 2021 నాటికి సీరం తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ బలంగా వ్యాపిస్తోంది. గత కొద్ది రోజులుగా రెండు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు సైతం భారీస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడమొక్కటే మార్గమనే అభిప్రాయం ఉంది. అయితే, పలు రాష్ట్రాల్లో టీకా నిల్వలు పరిమిత సంఖ్యలో ఉండడంతో టీకా కార్యక్రమం నెమ్మదించింది. ఈ నేపథ్యంలోనే టీకా ఉత్పత్తిని పెంచే దిశగా కేంద్రం పలు సంస్థలకు సహకారం అందిస్తోంది.