COVID 19: ఇండియా షట్డౌన్ విలువ రూ.9 లక్షల కోట్లు, ప్రస్తుతానికి ప్రభుత్వం మౌనం!
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండియా లాక్డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు 21 రోజుల పాటు ఇది అమలులో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం స్పష్టం చేశారు. ఈ లాక్డౌన్తో ప్రజలు ఇబ్బంది పడటంతో పాటు వ్యాపారులు, కంపెనీలకు భారీ నష్టమే. ఈ ప్రభావం భారత ప్రభుత్వానికి రెవెన్యూ తగ్గించడంతో పాటు వృద్ధి రేటుపై కూడా ప్రభావం పడుతుంది.
భారీగా తగ్గి.. హఠాత్తుగా రూ.1,100 పెరిగిన బంగారం ధర, అక్కడ రోజులో 100 డాలర్లు
రూ.9 లక్షల కోట్ల నష్టం
కరోనా మహమ్మారి కారణంగా ఇండియా లాక్డౌన్ కావడంతో 120 బిలియన్ డాలర్ల మేర నష్టమని నిపుణులు అంచనా వేశారు. అంటే దాదాపు రూ.9 లక్షల కోట్ల మేర (4 శాతం జీడీపీ) ప్రభావం పడనుంది. ఇప్పటికే పారిశ్రామికవర్గాలు తమ వృద్ధి అంచనాలు భారీగా దెబ్బతిననున్నాయని, ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
నష్టాల్లో ఈక్విటీ మార్కెట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్ 3వ తేదీన ఫస్ట్ బైమంత్లీ మానిటరీ పాలసీని ప్రకటించనుంది. వడ్డీ రేట్లు ఎక్కువగానే తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి మూడు వారాల లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.
వృద్ధి రేటు తగ్గింపు
ఇలాంటి పరిస్థితుల్లో 120 బిలియన్ డాలర్లు లేదా 4 శాతం జీడీపీ మేర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నట్లు బ్రిటిష్ బ్రోకరేజీ బార్స్లే వెల్లడించింది. అంతేకాదు, 2020-21 వార్షిక వృద్ధి రేటును 1.7 పాయింట్లు తగ్గించి 3.5కు పరిమితం చేసింది.
ఇతర దేశాల కంటే ముందే ఆర్బీఐ
మూడు వారాల లౌక్డౌన్ కారణంగా 90 బిలియన్ డాలర్ల మేర ప్రభావం ఉంటుందని, అంతకుముందే మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనా విషయంలో ఇతర దేశాల కంటే ఆర్బీఐ ముందే చర్యలు తీసుకుందని దేశీయ బ్రోకరేజీ సంస్థ ఎమ్కే ప్రశంసించింది. అయితే ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని తగ్గించేందుకు పెద్దగా ఏమీ లేవని పేర్కొంది.
ప్రస్తుతానికి ప్రభుత్వం మౌనం..
లాక్ డౌన్ వల్ల కలిగే ఆర్థిక ప్రభావంపై భారత ప్రభుత్వం ప్రస్తుతానికి మౌనంగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని నిరోధించే అంశంపై ప్రధానంగా దృష్టి సారించిందని ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలని అంటున్నారు. అయితే ఆర్థిక శాఖ వంటివి మాత్రం ఆర్థిక ప్రభావంపై దృష్టి సారించాయని, చర్యలు ఏముంటాయో చూడాలని అంటున్నారు.
ఆర్థిక ప్యాకేజీ
ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటి కారణంగా అసంఘటితరంగం తీవ్రంగా దెబ్బతిన్నదని ఎమ్కేపేర్కొంది. చిన్న వ్యాపారులకు సులభతర రుణాలు, రుణ పునర్నిర్మాణం, నగదు బదలీ వంటి ఆర్థిక ప్యాకేజీ వంటి వాటిని ప్రభుత్వం అమలు చేయవచ్చునని తెలిపింది. ఆర్థిక ప్యాకేజీ సిద్ధమవుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.