సుమారు 20శాతం జీతాల్లో కోత పెట్టిన టీవీఎస్ మోటార్స్, వారికి మాత్రమే
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ద్విచక్ర వాహన తయారీలో దిగ్గజ సంస్థ టీవీఎస్ మోటార్స్ తమ కంపెనీ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. అయితే, ఇది ఉన్నతస్థాయి ఉగ్యోగులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఈ జీతాల కోత మే నుంచి అక్టోబర్ వరకు అమలులో ఉంటుందని టీవీఎస్ వెల్లడించింది. కరోనా లాక్డౌన్ వల్ల ఏర్పడిన అనుకోని సంక్షోభం వల్లే ఆరు నెలలపాటు వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించినట్లు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, కార్మిక స్థాయి ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి మార్పులు ఉండదన్నారు.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు ఐదు శాతం, యాజమాన్య స్థాయి ఉద్యోగులకు 15-20 శాతం వేతనాన్ని తగ్గించి ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, లాక్డౌన్ తర్వాత మే 6న టీవీఎస్ కంపెనీ తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. దేశంలో మొత్తం మూడు తయారీ కేంద్రాల్లో ఉత్పత్పి ప్రారంభమైందని సంస్థ తెలిపింది.
కరోనా కారణంగా మార్చి నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ ద్విచక్ర అమ్మకాల్లో 55శాతం క్షీణతను నమోదు చేసింది. 2019 మార్చిలో కంపెనీ 3,10,885 యూనిట్లను విక్రయించగా, ఈ ఏడాది మార్చిలో కేవలం 1,33,988 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అమ్మకాలు భారీ ఎత్తున తగ్గడంతో జీతాల్లో కోత విధించినట్లు తెలుస్తోంది.