త్వరపడాల్సిందేనా?: టీవీ, ఫోన్, ఏసీ, ఫ్రిజ్.. త్వరలో పెరగనున్న ధరలు!
చైనాలో పుట్టిన కరోనా వైరస్ (Covid 19) ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం భారీగానే ఉండనుంది. భారత్పై కూడా వివిధ అంశాల్లో దీని పడనుంది. కోవిడ్ 19 కారణంగా ఫిబ్రవరి చివరి నాటికి టీవీలు, ఏసీలు, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు కూడా ప్రియం కానున్నాయి. ఈ ధరలు 5 శాతం నుండి పది శాతం వరకు పెరగవచ్చునని అంచనా.

అందుకే ధరలు పెరగవచ్చు
టీవీలు, స్మార్ట్ ఫోన్, ఏసీలు, రిఫ్రిజరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలపై కరోనా వైరస్ ప్రభావం కొద్ది రోజుల్లోనే భారీగా పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. చైనాలో తయారయ్యే ఈ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విడిభాగాల ధరలు పెరగటం, సరఫరాలు దెబ్బతిన్న నేపథ్యంలో ధరలు పెరగవచ్చునని చెబుతున్నారు.

ధరలు ఎంత పెరగవచ్చునంటే?
కొన్ని కంపెనీలు ఫిబ్రవరి నెల చివరలో, మరిన్ని కంపెనీలు మార్చి మొదటి వారంలో తమ ఉత్పత్తులపై ధరలను 3 శాతం నుండి 10 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టీవీల ధరలు 7 శాతం నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశముందని, మిగతా వాటి ధరలు 3 శాతం నుంచి 5 శాతం పెరగవచ్చునని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే సమస్యలు..
టెలివిజన్ మెయిన్ కాంపోనెంట్ టీవీ ప్యానెల్స్కు కొరత ఏర్పడింది. దీంతో వీటి ధరలు ఇప్పటికే 15 శాతం నుండి 20 శాతం పెరిగాయి. ఆపిల్ తమ ఐఫోన్ ఉత్పత్తులను పరిమితం చేసింది. ఈ మేరకు సోమవారం వెల్లడించింది. మరో నెల రోజుల వరకు పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని ఇప్పటికే రిటైలర్లకు స్పష్టం చేసింది.

ధరలు పెంచిన షియోమీ
చైనాకు చెందిన షియోమీ కంపెనీ గత వారం ఒక స్మార్ట్ ఫోన్ ధరల్ని రూ.500 పెంచింది. విడిభాగాల సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పాటు ధరలు పెరిగినందున పెంచక తప్పడం లేదని ప్రకటించింది. ఇతర చైనా కంపెనీలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి.

డిస్కౌంట్లలోనూ కోత
కరోనా వైరస్ కారణంగా ఉత్పత్తి తగ్గడంతో పలు కంపెనీలు సేల్స్ ప్రమోషన్ కోసం చేసే ఖర్చులు, రిటైలర్లకు ఇచ్చే డిస్కౌంట్స్ను తగ్గిస్తున్నాయి. నెల రోజుల పాటు పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని ప్రకటించిన ఆపిల్ అదే సమయంలో రిటైలర్లకు ఇచ్చే డిస్కౌంట్స్, ఇతర ప్రోత్సాహకాలు తగ్గించి, ధరలు పెంచకుండా ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలని భావిస్తోందట.

చైనా నుండే విడిభాగాలు ఎక్కువ
భారత మార్కెట్లోకి 85 శాతం స్మార్ట్ ఫోన్ విడిభాగాలు చైనా నుండి వస్తాయి. టీవీల తయారీ కోసం డ్రాగన్ దేశం నుండి 75 శాతం విడిభాగాలు వస్తాయి. ఏసీలు, ఫ్రిజ్ల కోసం కూడా చైనా నుండి పెద్ద మొత్తంలో విడిభాగాలు వస్తాయి.

దిగుమతిదారుల ఆందోళన
కరోనా వైరస్ కారణంగా చైనాలో ఎన్నో కంపెనీలు, సంస్థలు తాత్కాలికంగా మూతబడ్డాయి. దీంతో చైనా నుంచి పెద్దఎత్తున ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువులు, ఉపకరణాలు దిగుమతి చేసుకునే భారత దిగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో టీవీలు, స్మార్ట్ ఫోన్స్, ఫ్రిజ్లు, ఏసీలు తయారు చేసే కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విడిభాగాల కోసం చైనా ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడతారు. ఆటో, ఫార్మా సంస్థల పైనా ప్రభావం పడుతోంది.


Click it and Unblock the Notifications