కరోనా ఎఫెక్ట్, హీరో మోటో కార్ప్ అన్ని ఫ్యాక్టరీలు 4 రోజుల పాటు మూత
కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని తయారీ ప్లాంట్లలో కార్యకలాపాలను ఏప్రిల్ 22వ తేదీ నుండి మే 1వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. రాజస్థాన్లోని నీమ్రానాలో ఉన్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్(GPC)ని కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీకి ఆరు తయారీ కేంద్రాలు ఉన్నాయి. స్థానిక పరిస్థితుల బట్టి ఏప్రిల్ 22వ తేదీ నుండి మే 1వ తేదీ మధ్య దశలవారీగా ప్రతి ప్లాంట్, GPCని నాలుగు రోజుల పాటు మూసివేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది.
ప్లాంట్ను మూసివేస్తున్న ఈ సమయాన్ని తాము అవసరమైన మెయింటెనెన్స్ కోసం వినియోగించుకుంటామని తెలిపింది. ప్రతి ప్లాంట్, GPC నాలుగు రోజుల పాటు క్లోజ్ ఉంటుందని వెల్లడించింది. ఈ షట్ డౌన్ కంపెనీ డిమాండ్ సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది.
ఇటీవల కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ప్రతి రోజు లక్షల కేసులు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాలు స్థానికంగా లాక్ డౌన్ విధిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనందున దేశవ్యాప్త లాక్ డౌన్ ఉండదని పలుమార్లు ఆర్థికమంత్రి వెల్లడించారు.