20 లక్షల ఉద్యోగాలు పోయాయ్, డీజిల్పై రాయితీ, టోల్ ట్యాక్స్ తొలగింపుకు డిమాండ్
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ ప్రభావంతో ప్రయివేటు బస్సు, టూరిస్ట్ ట్యాక్సీ ఆపరేటర్ బాగా దెబ్బతిన్నారని బస్ అండ్ కారు ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BOCI) వెల్లడించింది. దాదాపు 20 లక్షలమంది ఉపాధి కోల్పోయారని పేర్కొంది. 1 కోటి మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారని, ఇందులో మరో 30 లక్షల నుండి 40 లక్షలమంది పరిస్థితి ఆందోళనకరమేనని తెలిపింది. 15 లక్షల బస్సులు, మ్యాక్సీ క్యాబ్స్, 11 లక్షల టూరిస్ట్ ట్యాక్సీలు నిర్వహిస్తున్న 20,000 మంది ఆపరేటర్లకు BOCI ప్రాతినిథ్యం వహిస్తోంది.
రిలయన్స్ రికార్డ్: టాప్ 10 కంపెనీల్లో ఎనిమిదింటి లాభం రూ.1.76 లక్షల కోట్లు
రుణాలపై వడ్డీ మాఫీ చేయండి
కోటి మంది వరకు నేరుగా ఉపాధి పొందుతున్న ఈ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించి ఆదుకోవాలని BOCI కోరుతోంది. కరోనా పరిస్థితుల్లో చాలామంది తమ సేవల్ని క్లోజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారని, అలాంటి వారికి పన్నుల మాఫీ, రుణాలపై వడ్డీ మాఫీ ద్వారా సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. లాక్ డౌన్ సమయంలో 95శాతం వానాలు రోడ్లపై తిరగలేదని, కేవలం కొన్ని బస్సులు మాత్రమే కంపెనీల కాంట్రాక్ట్ కారణంగా తిరిగాయని, మరికొన్ని వాహనాలను వలస కార్మికులను తరలించేందుకు ఉపయోగించినట్లు చెప్పింది.
వేతనాలు చెల్లించలేని పరిస్థితి
డిమాండ్ లేమి కారణంగా వ్యాపారాలు లేక ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయని BOCI ప్రెసిడెంట్ ప్రసన్న పత్వార్ధన్ అన్నారు. 'ఒక కోటి ఉద్యోగుల్లో కనీసం 30 నుండి 40 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. ఇప్పటికే 15 లక్షల నుండి 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.' అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయివేటు బస్సులు, క్యాబ్ ఆపరేటర్లకు ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.
ట్యాక్స్, టోల్ ట్యాక్స్ తొలగించండి, డీజిల్పై రాయితీ
కరోనా కారణంగా ఆర్బీఐ రుణాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం విధించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నుండి రుణాలు తిరిగి చెల్లించాలి. దీనిపై ప్రసన్న పత్వార్ధన్ స్పందిస్తూ.. ఆ తర్వాత కూడా తాము చెల్లించే పరిస్థితుల్లో చాలామంది లేరన్నారు. వెహికిల్ ట్యాక్స్ను తొలగించాలని, డీజిల్ పైన రాయితీ ఇవ్వాలని, ఇంటర్ సిటీ ట్రావెల్ ట్యాక్స్ టోల్ను తొలగించాలని కోరారు. గత మూడు నెలలుగా వాహనాలు ఇంటికే పరిమితమయ్యాయని, ఈ లాక్ డౌన్ కాలానికి మా బీమా పాలసీని కనీసం మూడు నెలలు పొడిగించాలన్నారు. బీమా చాలా ఖరీదైనదని, ఉదాహరణకు బస్సులకు రూ.50వేల నుండి రూ.2 లక్షల మధ్య ఉంటుందన్నారు. రుణాలపై వడ్డీని కూడా మాఫీ చేయాలన్నారు.
నిర్మాణాత్మక సంస్కరణలు
ఇప్పటికే ఉన్న రుణాల కోసం కాలపరిమితిని సంవత్సరం పాటు పొడిగించాలని ఆయన కోరారు. దీర్ఘకాలంగా ఉన్న ఒకే దేశం ఒకే పన్ను డిమాండును కూడా తెరపైకి తెచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని నిర్మాణాత్మక సంస్కరణలు చేయాల్సి ఉందన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం వివిధ రంగాలను ఆదుకునేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటోందని, కానీ పబ్లిక్ ట్రాన్సుపోర్ట్ సెక్టార్ రంగానికి వాటి ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.