ATM నుండి నగదు తీసుకొని దాచేస్తున్నారు, చెల్లింపు మాత్రం డిజిటల్గా
కరోనా నేపథ్యంలో ప్రజల ఆర్థిక ట్రాన్సాక్షన్స్ హాబిట్ను మార్చివేసింది. కర్ఫ్యూ, లాక్ డౌన్ కారణంగా ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని ప్రజలు భయాందోళనతో తమ వద్ద డబ్బును అట్టిపెట్టుకుంటున్నారు. ఇందుకోసం ATMల నుండి పెద్ద ఎత్తున నగదును ఉపసంహరించుకుంటున్నారు. తరుచూ బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్తే ఎక్కడ కరోనా వస్తుందోననే భయం, కేవైసీ నిబంధనలతో ఆసుపత్రులు వంటి వాటిల్లో రూ.2 లక్షలకు మించి నగదు చెల్లింపులకు అనుమతులు ఇందుకు దోహదపడుతోంది.
డబ్బులు దాచేస్తున్నారు
కరోనా నగదు వినియోగంపై ప్రజల ప్రవర్తనలో స్పష్టమైన మార్పును తీసుకు వచ్చినట్లుగా తేటతెల్లమవుతోంది. ATMల నుండి పెద్ద మొత్తంలో నగదును ఉపసంహరించుకుంటున్నప్పటికీ, దానిని ఇంట్లోనే అట్టిపెట్టుకొని చెల్లింపులను మాత్రం డిజిటల్ పద్ధతిలో చేస్తున్నారు. రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐ, డిజిటల్ పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఏటీఎంల నుండి నగదు ఉపసంహరణ గతంలో కంటే 20 శాతం మేర పెరిగిందని, ఇదే సమయంలో డిజిటల్ చెల్లింపులు స్థిరంగా ఉంటున్నాయి.
నగదు ఉపసంహరణ
అంతకుముందు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సగటున రూ.2000-రూ.3000 వరకు ఉపసంహరణ ఉండేది. ఇపుడు మాత్రం 20 శాతం పెరిగి రూ.3,000-రూ.4,000 వరకు ఉంది. సగటున రూ.1000 వరకు ట్రాన్సాక్షన్స్ను యూపీఐ ద్వారా చేస్తున్నారు. ఐఎమ్పీఎస్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్ రూ.6,000-రూ.7,000 నుండి రూ.9,000కు చేరుకున్నాయి. ఈ ఏడాది మార్చి 26వ తేదీ వరకు దేశంలో రూ.28,58,640 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉంటే ఈ నేల 7వ తేదీ నాటికి రూ.29,39,997 కోట్లకు చేరుకుంది. ఈ-కామర్స్ సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిని అనుమతించి ఉంటే ఇది మరింత పెరిగేదని అంనా.
ఆధార్ ఏటీఎం..
ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేసేందుకు కీలకమైన ఆధార్ ఏటీఎమ్లో ఉపసంహరణలు భారీగా పెరిగాయి. 2020-21 నాలుగో త్రైమాసికంలో ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ ద్వారా రూ.10,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అంతక్రితం ఏడాది ఇవి రూ.7650 కోట్లుగా ఉన్నాయి. ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్స్ గత ఏడాది రూ.30,000 కోట్లకు పైగా చేరుకున్నాయని, తమ రోజువారీ ట్రాన్సక్షన్స్ గరిష్ఠంగా రూ.165 కోట్లకు చేరాయని స్పైస్ మనీ వెల్లడించింది.