కరోనా దైవఘటన, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ: సీతారామన్
కరోనా మహమ్మారి ఒక అసాధారణ దైవఘటన అని, దేశ ఆర్థిక వ్యవస్థను ఇది దెబ్బతీసే అవకాశముందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లోటుకు కారణం కావడంతో పాటు దేశాభివృద్ధి సైతం కుంటుపడేలా చేస్తోందన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. జీఎస్టీ వసూళ్లపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సి ఉండగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2.35 లక్షల కోట్ల మేర లోటు ఏర్పడిందని తెలిపారు.
ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ, అత్యధిక శాలరీ ఈ దంపతులదే! కూతురుకు కోట్ల శాలరీ
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3 లక్షల కోట్లు జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉందని, రూ.65 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అలాగే, రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు అంశంపై రెండు ప్రతిపాదనలను రాష్ట్రాల ముందు ఉంచారు. ఆర్బీఐ నుండి తక్కువ వడ్డీకి రుణం తీసుకోవడం, రూ.2.35 లక్షల కోట్లను ప్రత్యేక ఏర్పాటు ద్వారా రూపొందించడం. ఈ ప్రతిపాదనలపై రాష్ట్రాలు ఏడు రోజుల్లో అభిప్రాయం చెప్పాలన్నారు. ఈ మొత్తం లోటులో జీఎస్టీ వల్ల రూ.97వేల కోట్లు కాగా, మిగతాది కరోనా ప్రభావం వల్ల జరిగిన లోటు అని అధికారులు తెలిపారు.
పన్ను రేట్ల గురించి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పన్నురేట్లు పెంచే అంశంపై చర్చించేందుకు ఇది తగిన సమయం కాదన్నారు. మార్చిలో ఇచ్చిన రూ.13,806 కోట్లతో కలిపి 2020లో రాష్ట్రాలకు రూ. 1.65లక్షల కోట్లు జీఎస్టీ పరిహారంగా విడుదల చేసినట్లు తెలిపారు. సుమారు ఐదు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోపాటు సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలుపంచుకున్నారు.