టాటా, రిలయన్స్ హ్యాట్సాప్: కరోనా సాయానికి రూ.100 కోట్లతో కంపెనీలు ముందుకు
కరోనా మహమ్మారి నేపథ్యంలో కార్పోరేట్ సంస్థలు సాయం చేస్తున్నాయి. భారత్లో సెకండ్ వేవ్ తీవ్ర ఆందోళనకరంగా మారింది. దీంతో జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తమవంతుగా వివిధ రూపాల్లో సహకారం అందిస్తున్నాయి. పెద్ద ఎత్తున నిధులను అందిస్తున్నాయి. మారుతీ వంటి కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేసి ఆక్సిజన్ రూపంలో సహకరిస్తున్నాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్, టాటా, విప్రో, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు తమవంతుగా కరోనాపై పోరుకు సహకరిస్తున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సేవాభారతి వంటి స్వచ్చంధ సంస్థలు మేమున్నామంటూ ముందుకు వస్తున్నాయి.
మారుతీ సుజుకీ సహకారం ఇలా
దేశంలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు, రవాణా సమస్యలు తొలగించేందుకు వీలుగా మారుతీ సుజుకీ ఎయిరోక్స్ నైజెన్ ఎక్విప్మెంట్స్, శాం గ్యాస్ ప్రాజెక్ట్స్ అనే పీఎస్ఏ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్స్ కంపెనీలతో చేతులు కలిపింది. ఈ సంస్థలు ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ల తయారీలో ఉన్నాయి. వీటి ఉత్పత్తి పెంచేందుకు మారుతీ సహకరిస్తుంది.
ఈ రెండు కంపెనీలు చిన్న తరహావి. దీంతో ఉత్పత్తిని పెంచలేకపోతున్నాయి. నెలకు 5 నుండి 8 ప్లాంట్స్నే ఉత్పత్తి చేయగలుగుతున్నాయని, అందుకే తమ వనరులను ఉపయోగించి ఆ రెండు సంస్థలు ప్లాంట్స్ ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకుంటామని మారుతీ తెలిపింది.
ప్రాణాలు కాపుడుతున్న రిలయన్స్, టాటా
రిలయన్స్ ఇండస్ట్రీస్ కరోనా రోగుల ఉచిత చికిత్స కోసం ముంబై, జామ్నగర్లో 1,875 బెడ్స్తో కూడిన రెండు టెంపరరీ ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. జామ్నగర్లోని తన రిఫైనరీ నుండి రోజుకు వెయ్యి టన్నుల మెడికల్ ఆక్సిజన్ను సరఫరా చేస్తోంది.
ఇక టాటా గ్రూప్ తన స్టీల్ ప్లాంట్ నుండి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. ఉచిత చికిత్సకు 5000 పడకల తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేసింది.
ఐటీ దిగ్గజాల సహకారం
కరోనాపై పోరుకు ఐటీ దిగ్గజాలు తమవంతు సహకారం చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది. విప్రో, టెక్ మహీంద్రా వంటి దిగ్గజాలు కూడా సహకరిస్తున్నాయి. కొన్నిచోట్ల తమ ప్రాంగణంలో కరోనా కేర్ సెంటర్లుగా మార్చాయి.
గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ నెలాఖరు లోపు 7 ఆక్సిజన్ ప్లాంట్లను డీసీఎం శ్రీరామ్ ఏర్పాటు చేయనునుంది.
పేటీఎం ఫౌండేషన్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ సహా 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు గుజరాత్కు అందించనుంది.
భారత్లో కరోనా ఉపశమన చర్యలకు దాదాపు రూ.110 కోట్ల సాయాన్ని ప్రకటించింది ట్విటర్. ఈ మొత్తాన్ని ప్రభుత్వేతర సంస్థలైన కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏలకు అందించనుంది.