పెరుగుతున్న కార్పొరేట్ మోసాలు: ఈ ఏడాది ఒక్క ఎస్బీఐలోనే మూడింతలు!
బ్యాకింగ్ రంగంలో కార్పొరేట్ మోసాలు పెరిగిపోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లోనే ఇవి మూడింతలు పెరిగాయి. ఈ విషయాన్ని స్వయంగా ఎస్బీఐ ఇటీవలే ఓ ఐపీవో డాక్యుమెంట్ డేటాలో వెల్లడించడం గమనార్హం.
అంతేకాదు, ఎన్పీఏల విషయంలోనూ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ని మోసం చేస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితమే ఎన్పీఏలుగా మారిన వాటిని బ్యాంకులు ఇప్పుడు మోసాల చిట్టా కింద చేరుస్తూ ఆర్బీఐకి సమాచారం అందజేస్తున్నాయని ఓ కన్సల్టింగ్ కంపెనీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ పేర్కొన్నారు.
ఎస్బీఐలో మోసాలు ‘మూడింతలు’...
మోసాలను బహిర్గతం చేసే విషయంలో బ్యాంకులపై మరింత కఠినమైన నిబంధనలను ఆర్బీఐ తీసుకొస్తుండడంతో బ్యాంకులు కూడా ఇక దాచిపెట్టి ప్రయోజనం లేదనుకుని మెల్లమెల్లగా కార్పొరేట్ మోసాలను వెలుగులోనికి తీసుకొస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలోనే ఎస్బీఐలో ఈ రకమైన మోసాలు మూడింతలు పెరిగాయంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో రూ.26,757 కోట్ల కార్పొరేట్ ఫ్రాడ్స్ను గుర్తించి, రెగ్యులేటర్స్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఇటీవల ఎస్బీఐ తెలిపింది. అది కూడా రూ.100 కోట్ల విలువైన మోసాలనే ఈ బ్యాంకు ఆర్బీఐకి అందజేసిన సమాచారంలో పేర్కొంది. దీంతో రూ.50 కోట్లకు పైన ఉన్న ఎన్పీఏలను కూడా ఫ్రాడ్ కోణంలో దర్యాప్తు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ అదేశించింది.
ఎస్బీఐ తరువాత పీఎన్బీలోనే అధికం...
ఒక్క ఎస్బీఐలో మాత్రమే కాదు, ఇతర బ్యాంకుల్లోనూ ఈ తరహా మోసాలు బాగానే పెరుగుతున్నాయి. 2019 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో రూ.95,760 కోట్ల విలువైన కార్పొరేట్ మోసాలు జరిగినట్లు బ్యాంకులు తెలిపాయని ఇటీవల రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా చూస్తే.. ఎస్బీఐ తరువాత అత్యధిక కార్పొరేట్ మోసాలు జరిగిన బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ముందు వరుసలో ఉంది. తమ బ్యాంకులో ఈ ఏడాది రూ.10,821 కోట్ల విలువైన మోసాలు జరిగినట్లు పీఎన్బీ రిపోర్ట్ చేసింది.
ఎప్పుడో జరిగిన మోసాలు ఇప్పుడు వెలుగులోకి...
బ్యాంకుల్లో చాలా ఆర్థిక మోసాలు ఈ ఏడాది ప్రారంభంలోనే జరిగాయి. కానీ బ్యాంకులు మాత్రం వాటిని ఇప్పుడిప్పుడే వెలుగులోకి తీసుకొస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితమే ఎన్పీఏలుగా మారిన వాటిని బ్యాంకులు ఇప్పుడు ఫ్రాడ్గా పేర్కొంటూ వెలుగులోకి తీసుకొస్తున్నాయని బిగ్4 కన్సల్టింగ్ కంపెనీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ పేర్కొన్నారు. కొన్ని కేసులో ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభించినట్లు కూడా తెలిపారు. ఇండియన్ బ్యాంక్లో జరిగిన కార్పొరేట్ మోసాలను గుర్తించడానికి, వాటిని తమ దృష్టికి తీసుకురావడానికి ఆ బ్యాంక్కు 55 నెలల సమయం పట్టిందని ఆర్బీఐ పేర్కొంది. బ్యాంక్లు ఒక్కసారి ఒక ఖాతాను ఎన్పీఏగా లేదంటే కార్పొరేట్ మోసంగా డిక్లేర్ చేస్తే.. ఆ నష్టాన్ని పూరించేందుకు వెంటనే దానికి సరిపడా మొత్తాన్ని ప్రొవిజన్ రూపంలో పక్కన పెట్టాల్సి ఉంటుందని, అందుకే బ్యాంకులు చాలాకాలం వరకు ఈ తరహా మోసాలను దాచిపెడుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
కార్పొరేట్ కంపెనీలు ఎందుకిలా?
బ్యాంకుల నుంచి వందల కోట్లు రుణాలుగా తీసుకున్న కార్పొరేట్ కంపెనీలు ఆ తరువాత వాటిని చెల్లించకుండా ఎగవేస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలు నిధులను అనధికారిక అవసరాలకు మళ్లించడం వల్లనే చాలా మోసాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు వ్యాపారం సరిగా సాగక కంపెనీలు దివాలా తీయడం వల్ల కూడా అవి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంటోంది. గత రెండేళ్ల కాలంలో బ్యాంకులు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్ తదితర కంపెనీలను ఎన్పీఏలుగా డిక్లేర్ చేశాయి. భారీగా రుణ ఎగవేతలకు పాల్పడిన పలు కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే దర్యాప్తు సంస్థల నుంచి ప్రాసిక్యూషన్ను ఎదుర్కొంటున్నాయి.