కరోనా ఎఫెక్ట్, భారీగా తగ్గిన చికెన్-గుడ్డు ధరలు: వీటిని తినవచ్చా.. ప్రభుత్వం మాట ఇదీ?
చైనాతో పాటు ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మాంసాహార ప్రియుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ వైరస్ కారణంగా భారత్లో చికెన్ విక్రయాలు భారీగా పడిపోయాయి. దీంతో వీటి ధరలు తగ్గిపోయాయి. వారం పది రోజుల్లోనే ధరలు యాభై శాతం వరకు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువగా పడిపోయాయి.
కరోనా వైరస్ భయం
తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో వివిధ ప్రాంతాల్లో చికెన్ ధరలు పడిపోయాయి. ఇందుకు చికెన్ ద్వారా వైరస్ సోకుతుందనే ప్రచారమే కారణం. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు సగటున సగటున నాలుగైదు లక్షల కేజీల చికెన్, సెలవు రోజుల్లో ఏడెనిమిది లక్షల కేజీల చికెన్ అమ్ముడవుతుంది. పండుగల వంటి రోజుల్లో ఇది రెండింతలు ఉంటుంది.
తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చికెన్ వినియోగంలో తొలి మూడు స్థానాల్లో ఉండాయి.
భారీగా తగ్గిన చికెన్ ధరలు
అయితే కరోనా వైరస్ భయంతో చికెన్కి డిమాండ్ తగ్గింది. అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో కిలోకు రూ.220 నుండి రూ.150కి వచ్చింది. ఇక్కడ ముప్పై నుండి నలభై శాతం వరకు తగ్గింది. అదే సమయంలో మటన్ ధర మాత్రం పెరుగుతోంది. చికెన్కు డిమాండ్ తగ్గడంతో మటన్కు డిమాండ్ పెరిగింది.
గుడ్ల వినియోగమా తగ్గింది..
చికెన్కు, కరోనా వైరస్కు ముడిపెట్టి సోషల్ మీడియాలోను జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రభావం పౌల్ట్రీ బిజినెస్పై తీవ్రంగా పడుతోంది. గత కొద్ది రోజులుగా చికెన్తో పాటు గుడ్ల వినియోగం తగ్గి ధరలు పడిపోయాయి. గుడ్డు ధర రూ.5.50 నుండి రూ.4కు తగ్గింది. కోళ్ల రైతులు, దీనిపై ఆధారపడి జీవించే వారికి నష్టం కలిగిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది.
చికెన్ వినియోగం సురక్షితం
పక్షుల నుండి కరోనా వైరస్ మనుషులకు వ్యాప్తి చెందుతోందన్న కథనాలపై కేంద్ర పశు సంవర్ధక మంత్రిత్వ శాఖ స్పందించింది. చికెన్, పౌల్ట్రీ ఉత్పత్తులు తినడంతో కరోనా వైరస్ సోకదని స్పష్టం చేసింది. చికెన్ వినియోగం సురక్షితమని, ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తెలిపింది.
జీహెచ్ఎంసీ కూడా....
చికెన్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, చికెన్ యథావిథిగా తినవచ్చని జీహెచ్ఎంసీ ముఖ్య పశుసంవర్ధక అధికారి కూడా మరో ప్రకటనలో వెల్లడించారు. చికెన్ ద్వారా కరోనా వస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వెటర్నరీ డాక్టర్లు కూడా చెబుతున్నారు.
అసత్య ప్రచారం
చికెన్, గుడ్ల ద్వారా వైరస్ సోకినట్లు ఎప్పుడూ నిర్ధారణ కాలేదని, లక్షలాది మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోందని, దీనిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఈ రంగానికి చెందిన వారు చెబుతున్నారు.