కరోనా: నష్టాల్లో ఇన్వెస్టర్ల అమ్మకం, టైం చూసి ప్రమోటర్లు సొమ్ము చేసుకుంటున్నారా?
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత కొంతకాలంగా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దీంతో ఒకటి రెండు మినహా అన్ని రంగాల్లోని.. అని కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లు అమ్మివేస్తున్నారు. దీంతో కంపెనీల షేర్లు దిగజారుతున్నాయి. ఆయా కంపెనీల షేర్లు 52 వారాల కనిష్టానికి, సంవత్సరాల కనిష్టానికి కూడా చేరుకుంటున్నాయి.
ఇన్వెస్టర్ల అమ్మకం.. వాటా పెంపుపై ప్రమోటర్ల కన్ను
కరోనా వైరస్ కారణంగా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంటే.. ఇలాంటి పతనం సమయంలోనూ ప్రమోటర్లు ఆయా కంపెనీల్లోని షేర్లు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా కంపెనీలలో వాటా పెంపుపై దృష్టి సారిస్తున్నారు. ఓ వైపు మార్కెట్లు కుప్పకూలుతుంటే కొంతమంది ప్రమోటర్లు వాటా పెంపుపై దృష్టి సారించి, కొనుగోలు చేస్తున్నారట. ఇటీవలి కాలంలో పలు కంపెనీలు మధ్యంతర డివిడెండ్ ప్రకటించాయి.
నెల రోజుల్లో 197 కంపెనీలు
గత నెల రోజుల్లో దాదాపు 197 డొమెస్టిక్ కంపెనీల ప్రమోటర్లు ఆయా కంపెనీల్లో తమ స్టాక్స్ను పెంచుకున్నారు. స్టాక్ ఎక్స్చేంజ్లో ఓపెన్ మార్కెట్ ద్వారా అమ్మకాలు పెరుగుతుండటంతో వీటిని కొనుగోలు చేశారు. ఇందులో ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి.
టాటా సన్స్ సహా..
మార్కెట్లు కరెక్షన్ చూస్తుండటంతో పలు కంపెనీల షేర్లు దిగివస్తున్నాయి. దీంతో ప్రమోటర్లు ఇప్పుడే వాటా పెంపుపై ఆసక్తి చూపుతున్నారట. ఈ జాబితాలో టాటా గ్రూప్కు చెందిన టాటా సన్స్, మారుతీ, బజాజ్, గోద్రెజ్ తదితర గ్రూప్ల ఉన్నాయి. ఇటీవల ప్రకటించిన మధ్యంతర డివిడెండ్లు ప్రమోటర్లకు మేలు చేస్తుందంటున్నారు.
టాటా దక్కించుకున్న షేర్లు..
గత నెల రోజుల్లో టాటా కెమికల్స్లోని 77 లక్షల షేర్లను టాటా సన్స్ సొంతం చేసుకుంది. ఇందుకు రూ.569 కోట్లు వెచ్చించింది. రూ.457 కోట్ల విలువైన టాటా స్టీల్కు చెందిన 1.55 కోట్ల షేర్లను కూడా కొనుగోలు చేసింది. రూ.178 కోట్ల విలువైన 1.66 కోట్ల ఇండియన్ హోటల్స్ షేర్లను, రూ.118 కోట్ల విలువైన 2.67 కోట్ల టాటా మోటార్స్ (DVR) షేర్లనూ కొనుగోలు చేసింది.
సుజుకీ.. బజాజ్
సుజుకీ మోటార్ కార్పోరేషన్... మారుతీ సుజుకీలో 2.11 లక్షల షేర్లను రూ.135 కోట్లతో కొనుగోలు చేసింది. బజాజ్ ఫ్యామిలీ రూ.91 కోట్ల విలువైన బజాజ్ ఆటో షేర్లను, రూ.50 కోట్ల విలువైన బజాజ్ హోల్డింగ్స్ వాటాను, మరో రూ.36 కోట్ల బజాజ్ ఫిన్సర్వ్ వాటాను సొంతం చేసుకుంది.
గోద్రేజ్ ఫ్యామిలీ...
గోద్రెజ్ ఫ్యామిలీ గోద్రెజ్ ఆగ్రోవెట్కు చెందిన రూ.132 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. గోద్రెజ్ ఇండస్ట్రీస్, ఆస్టెక్ లైఫ్ సైన్సెస్లలో వాటాలను జమ చేసుకుంటోందట.
ఆయా కంపెనీలు కొనుగోలు చేసిన షేర్లు..
గత నెల రోజుల్లో ఆయా కంపెనీలు కొనుగోలు చేసిన షేర్లు.. టాటా కెమికల్స్ 77,93,985 షేర్లు, టాటా స్టీల్ 1,55,35,057 షేర్లు, ఇండియన్ హోటల్స్ 1,65,66,846 షేర్లు, మారుతీ సుజుకీ 2,11,000 షేర్లు, గోద్రేజ్ ఆగ్రోవెట్ 26,09,000 షేర్లు, సన్ ఫార్మా 30,79,154 షేర్లు, టాటా మోటార్స్ (DVR) 2,67,22,401 షేర్లు, బజాజ్ ఆటో 3,42,000 షేర్లు కొనుగోలు చేశాయని తెలుస్తోంది.
పీవీఆర్ సహా..
మిగతా కంపెనీల్లో జీఎమ్మార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్సన్ ఎంటర్ ప్రైజెస్, జస్ట్ డయల్, చంబల్ ఫెర్టిలైజర్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎంఆర్ఎఫ్, ఏషియన్ పెయింట్స్, పీవీఆర్ తదితర ప్రమోటర్లు వాటాల కొనుగోలుపై దృష్టి సారించారట.