కరోనా వైరస్ : రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి! కేంద్రానికి పరిశ్రమల సమాఖ్య విజ్ఞప్తి
కరోనా వైరస్ దెబ్బకు విలవిలలాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించాలని పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ - సిఐఐ) కోరుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 21 రోజుల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించటంతో ... ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం పడబోతోంది. అన్ని రంగాలు, పరిశ్రమలు, ఆఫీసులు, హోటళ్లు మూతపడటంతో రోజు వారీ కార్యక్రమాలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసర సేవలు మినహా అన్ని రంగాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ ను కాపాడాలంటే ఒక్క కేంద్ర ప్రభుత్వం వల్లే అవుతుందని సిఐఐ పేర్కొంది. అందుకే తక్షణమే రూ 2 లక్ష కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని వార్తలు కూడా వెలువడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల దరిమిలా దేశం సుమారు రూ 9 లక్షల కోట్ల నుంచి రూ 10 లక్షల కోట్ల మేరకు ప్రభావితం అవుతుందని, అయితే, కనీసం రూ 2 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే పరిస్థితులు చక్కబడే అవకాశాలు ఉన్నాయని సిఐఐ వెల్లడించినట్లు తెలిసింది.
3 నెలలు పీఎఫ్ మేమే చెల్లిస్తాం: PFపై మోడీ ప్రభుత్వం గుడ్న్యూస్, కండిషన్స్ అప్లై
ఆర్థిక వ్యవస్థపై చర్యలు
ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ... ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు తగిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ అన్ని అంశాలను పరిగణన లోకి తీసుకుని తగిన చర్యలను ప్రకటిస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇప్పటికే పన్ను చెల్లింపుల గడువును, జీఎస్టీ ఫైలింగ్ గడువును పొడిగిస్తూ కొన్ని నిర్ణయాలను ప్రకటించింది కూడా. ప్రస్తుతం అత్యున్నత స్థాయి అధికారులు, డిపార్టుమెంట్ల అధిపతులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని ఉధ్దీపన ప్యాకేజీలు నేడు ప్రకటించారు.
అమెరికా లో 2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ..
కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలం అయిపోతున్న అగ్రరాజ్యం అమెరికా... ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టేందుకు ఇప్పటికే ఒక ఆర్థిక ప్యాకేజీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 1,000 కి చేరువ అవుతోంది. మరో 50,000 మందికి వైరస్ సోకి పరిస్థితులు చేయి జారిపోతున్నాయి. అందుకే, అమెరికా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దెందుకు, పలు రంగాలకు ఆర్థిక చేయూత నిచ్చేందుకు, ఉద్యోగులను తీసివేయకుండా ప్రైవేటు కంపెనీలకు తగిన ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు సుమారు 2 ట్రిలియన్ డాలర్ల వరకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. అక్కడి సెనేట్ ఆమోదం తెలిపితే వెంటనే ఆర్థిక ప్యాకేజీ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నిర్ణయం నేపథ్యంలో అమెరికా సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కొంత కోలుకున్నాయి. భారత స్టాక్ మార్కెట్లు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాయి.
కరోనాకు రూ 15,000 కోట్లు...
దేశంలో రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి బారిన పడిన వారికి అవసరమైన చికిత్స అందించేందుకు, తగిన ఎక్విప్మెంట్ కొనుగోలు కోసం ఆర్థిక చేయూత అందించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం వెంటనే రూ 15,000 కోట్ల నిధులను ఆరోగ్య శాఖ కు అందజేయాలని ఆదేశించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అందించనున్నారు. వాటికి అవసరమైన సామాగ్రి కొనుగోలు కోసం అత్యవసర నిధుల కింద వీటిని మంజూరు చేయనున్నారు. ఇది కాకుండా ఇప్పటికే సుమారు 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం రేషన్ సరుకులను అదనంగా అందించే ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా రూ వేల కోట్లలో ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒక్క తెలంగాణ ప్రభుత్వమే సుమారు రూ 2,400 కోట్ల మేరకు ఖర్చు చేయబోతోంది.