కరోనా వైరస్: ఇండియా కు వరమా.... శాపమా?
కోవిద్ - 19 (కరోనా వైరస్) పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. ఇక చైనా పరిస్థితి అయితే మరీ దారుణం. ఇప్పటికే అక్కడ సుమారు 1,600 మంది ప్రాణాలు కోల్పోయారు. 60,000 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. చైనా వెలుపల వివిధ దేశాల్లో సుమారు 1,000 మందికి ఈ వైరస్ సోకిందని సమాచారం. ఈ ప్రాణాంతక వైరస్ కు తగిన విరుగుడు లేకపోవటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ప్రపంచానిది. ఇది ఆరోగ్యపరమైన సమస్య కావటంతో .. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా సహా అనేక దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించాయి. కేవలం మనుషుల రాకపోకలతో పాటు చైనా నుంచి లేదా చైనా కు వెళ్లాల్సిన సరుకుల రవాణాపై కూడా భారీ ప్రభావం కనిపిస్తోంది.
ఇప్పటికే నెలకు పైగా పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. దీంతో మన దేశంలోని చాలా రకాల ఉత్పత్తుల స్టాక్స్ నింపుకుంటున్నాయి. మరిన్ని రోజులు ఇలాగే సాగితే ఇండియా లో చాలా వరకు ఎలక్ట్రానిక్స్, టాయ్స్, ఫార్మా ముడి సరుకులు, ఫర్నిచర్, గృహోపకరణాలు వంటి అనేక రకాల సరుకుల లభ్యత తగ్గిపోతుంది. దాంతో వాటి ధరలు అమాంతం పెరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దీనికి మన దేశం ఎలా సన్నద్ధం అవుతుంతో చూడాలి. ఆలస్యం అమృతం... విషం అని అంటారు. ఏ విషయంలోనైనా కొంత ఆలస్యం మంచి చేస్తే... మరీ ఎక్కువ ఆలస్యం చేటు చేస్తుందనేది సారాంశం.
ఎక్సపోర్ట్స్... ఇంపోర్ట్స్ పై ప్రభావం..
చైనా - భారత్ ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 90 బిలియన్ డాలర్లు ఉంటుంది. అందులో చైనా నుంచి మన దేశానికి వచ్చే దిగుమతులు అధికం. సుమారు రెండింతలు పైగా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటే... కేవలం మూడింట ఒక వంతు కూడా మన దేశం నుంచి చైనా కు ఎగుమతులు జరగవు. కానీ ప్రస్తుతం అటు ఎగుమతులు, ఇటు దిగుమతులు రెండూ దెబ్బతింటున్నాయి. మన దేశం ప్రధానంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అధికంగా దిగుమతి చేసుకుంటుంది. మన ఫార్మా ఇండస్ట్రీ కి అవసరమైన కీలకమైన ముడి సరుకులు కూడా చైనా నుంచే రావాలి. గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు, బొమ్మలు తదితర ప్రొడక్టుల దిగుమతులు తగ్గుతున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో వాటి ధరలు మన దేశంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు భారత్ వెంటనే ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని రోజులు కొనసాగితే కష్టమే ...
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒక్క భారత దేశానికే కాదు ... మొత్తం ప్రపంచానికి కూడా ప్రమాదమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రపంచ అవసరాల్లో మొత్తం 10-12% ఒక్క చైనా నే సమకూరుస్తుంది. ఎందుకంటే ప్రపంచ మొత్తం ట్రేడ్ వేల్యూ 20 ట్రిలియన్ డాలర్లు అయితే... ఒక్క చైనానే 2.5 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తుంటుంది. అంటే దాని సత్తా ఏమిటో తెలిసివస్తుంది. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం చైనా అటు ఎగుమతులపై, ఇటు దిగుమతులపై దృష్టి సారించలేకపోతోంది. ఇది అన్ని దేశాలపైనా ప్రభావం చూపబోతోందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా అంటేనే చవకగా అన్ని రకాల ఉత్పత్తులను అందించగలిగే దేశం. సరుకు ఎంత కావాలన్నా ఉత్పత్తి చేయగలిగే సత్తా ఉన్న దేశం. కానీ ఇప్పుడు అక్కడ చాలా కంపెనీలు మూతపడి ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందో తెలియని సందిగ్ధం నెలకొంది.
చైనా కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ..
భారత్ కూడా కొంత కాలంగా దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులతో పాటు అనేక రంగాల్లో మన దేశంలో కూడా పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటికే మన దేశ అవసరాల్లో మూడింట రెండొంతుల మొబైల్ ఫోన్లు ఇక్కడే తయారు అవుతున్నాయి. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. అయితే, మన దేశం ఫార్మస్యూటికల్స్ సహా అనేక రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించింది. ఈ రంగాల్లో మనం ఎగుమతులు కూడా చేస్తున్నాం. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిణామాల దృష్ట్యా... ఇండియా నుంచి అభివృద్ధి చెందిన దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు పెంచితే చైనా కు ప్రత్యామ్నాయంగా ఎదిగే పూర్తి అవకాశం లభిస్తుందని ఆర్దికేవేత్తలు అంటున్నారు. చైనా తో ధరలో పోటీ పడలేక చాలా కాలంగా ఇండియన్ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లో గట్టి పోటీ ఎదురయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి కాబట్టి, వెంటనే ఇండియా ఈ అవకాశాన్ని సద్వినియోగం ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.