కరోనా వైరస్: 100 ఏళ్లలో అతిపెద్ద సంక్షోభం, నష్టమెంతో తెలిస్తే షాక్!
రోనా వైరస్.. ఈ పేరు చెబితే ప్రస్తుతం ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ మహమ్మారి బారిన పడని దేశాలు చాలా తక్కువనే చెప్పాలి. 100 కు పైగా దేశాలకు విస్తరించి రోజుకు వందల్లో ప్రజల ప్రాణాలను కబళిస్తున్న కరోనా వైరస్... ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తలచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. చైనా లో మొదలైన ఈ సరికొత్త వైరస్... అమెరికా వరకు విస్తరించి అగ్ర రాజ్యాన్ని కూడా భయపెడుతోంది. గతేడాది డిసెంబర్లోనే కరోనా వైరస్ ప్రభలినా.. చైనా చాలా రోజుల వరకు ఆ విషయాన్ని బయటకు పొక్కకుండా దాచిపెట్టింది. కానీ పరిస్థితులు చేయి దాటి పోవటంతో జనవరిలో కరోనా వైరస్ ఉందన్న వాస్తవాన్ని చైనా అంగీకరించింది. ఇక అప్పటి నుంచి అటు చైనా... ఇటు ప్రపంచం కరోనా గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. కానీ అది కాస్తా తమ గడప వరకు వస్తుందని, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు కరోనా వైరస్ ను కేవలం ఆరోగ్య అత్యవసర పరిస్థితి గానే కాకుండా... ఆర్థిక అత్యవసర పరిస్థితిగా కూడా గుర్తిస్తున్నాయి.
కరోనా షాక్: అమ్మో! ఈ బంగారం మాకు వద్దు.. ఇన్వెస్టర్లు దూరం
10 ట్రిలియన్ డాలర్ల నష్టం...
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర స్థాయిలో దెబ్బతినబోతోంది. గత 100 ఏళ్లలో ఎన్నడూ చూడనంత తీవ్ర స్థాయిలో నష్టం ఉండబోతోందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. తొలుత కరోనా కేవలం ఒక్క చైనా కు మాత్రమే పరిమితం అవుతుందని అనుకున్నారు. అప్పుడు సుమారు 1 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అంచనా వేయగా... ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రపంచమంతా పాకింది. కాబట్టి నష్టం పది రెట్లు దాటిపోనుందని భావిస్తున్నారు. అంటే సుమారు 10 లక్షల కోట్ల డాలర్ల మేరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నష్టపోనుంది. మన కరెన్సీ లో చెప్పాలంటే 750 లక్షల కోట్లు అన్నమాట. ఇప్పుడు ప్రపంచం నష్టపోయే సొమ్ము తో భారత దేశాన్ని సుమారు 30 ఏళ్ళ పాటు పోషించవచ్చు అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
1918 లో ఇలాంటిదే ఒకటి...
చాలా మందికి తెలియక పోవచ్చు కానీ.. 1918 లో ప్రపంచాన్ని ఒక వైరస్ ఇలాగే భయపెట్టిందంట. ముఖ్యంగా మన భారత దేశాన్ని పట్టి పీడించిందట. దాని ధాటికి ఒక్క ఇండియాలోనే లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు అప్పటి మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వస్తోంది. కానీ 100 ఏళ్ళ క్రితం మెడిసిన్ ఇంతలా అందుబాటులో లేదు కాబట్టి మరణాల రేటు అధికంగా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా అప్పుడు సుమారు 5 కోట్ల మంది చనిపోయి ఉంటారని ఒక అనధికారిక అంచనా ఉంది. అది రెండు ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన సైనికుల కంటే చాలా అధికం. ఇప్పుడు వైద్య రంగం ఇంతలా అభివృద్ధి చెందినా... టెక్నాలజీ ఎంతలా అందుబాటులోకి వచ్చినా కూడా కరోనా వంటి ప్రాణాంతక వైరస్ లకు విరుగుడు కనిపెట్టలేకపోవటం ఒక విషాదమనే చెప్పాలి.
ఇండియా పరిస్థితి ఏమిటి?
చైనా కు పొరుగునే ఉండి, జనాభా లో 100 కోట్లకు దాటి ఉన్న అతి పెద్ద దేశం భారత్. చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం కాబట్టి కరోనాను బయటకు పొక్కనీయకుండా చూసుకోగలిగింది. కానీ భారత్ లో పరిస్థితులు వేరు. మనది ప్రజాస్వామ్య దేశం. ఏదైనా పారదర్శకంగా జరగాల్సిందే. కాబట్టి మనం నిజాలను కప్పి పుచ్చలేం. కానీ, అదృష్టమో, లేదా మన దేశ భౌగోళిక, ఉష్ణోగ్రత వల్లనో కానీ ఇండియా పై కరోనా వైరస్ ప్రభావం ప్రత్యక్షంగా తక్కువేనని చెప్పాలి. ఇప్పటి వరకు మన దేశంలో కేవలం 100 లోపు అనుమానిత కేసులు నమోదైతే కేవలం రెండు మరణాలు మాత్రమే నమోదయ్యాయి. అదే అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో మరణాల రేటు 50 దాటగా ... ఇటలీ లో 500 స్థాయికి చేరుకోవటం గమనార్హం. అయితే, మనం ఉదాసీనంగా ఉంటే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఉష్ణోగ్రతలు కరోనా వైరస్ నుంచి మనల్ని కాపాడలేవని పాలకులు గుర్తించి, తగు నివారణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.