కరోనా ఎఫెక్ట్ ... ఇన్సూరెన్స్ లకు పెరిగిన డిమాండ్, జోరుగా భీమా కంపెనీల బిజినెస్ !!
ఒకప్పుడు ఇన్సూరెన్స్ చేయడం అంటే అవసరమా అన్నట్లు చూసేవారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేసేవారు. ఇక కొందరైతే ఒకవేళ ఇన్సూరెన్స్ చేస్తే ఖచ్చితంగా పోతామని కూడా నిర్ధారించుకునే వారు. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా ప్రజలలో ఇన్సూరెన్స్ చేయాలన్న ఆలోచన బాగా పెరిగింది. ఆరోగ్య భీమా, జీవిత భీమాలను చేయడంపై ప్రస్తుతం ప్రజలు దృష్టి సారిస్తున్నారు.
జీవిత భీమా, ఆరోగ్య భీమాలపై ప్రజల్లో పెరిగిన ఇంట్రెస్ట్
కరోనా మహమ్మారి కారణంగా ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కరోనా ఫస్ట్ వేవ్ , కరోనా సెకండ్ వేవ్ లలో లక్షల్లో ప్రజలు ప్రాణాలు వదిలారు. లక్షలాది కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయాయి. కరోనా మహమ్మారి వీళ్లకు మాత్రమే వస్తుంది అన్న పరిమితులు కూడా ఎక్కడా లేవు. దీంతో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల, తమ జీవితం పట్ల భరోసా కోసం ఇన్సూరెన్స్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
గతంలో ఇన్సూరెన్స్ ఏజెంట్ ను చూస్తేనే పారిపోయేవారు.. కానీ ఇప్పుడు
ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే తాము ప్రాణాలు కోల్పోతే, తమ వారికి ఆర్థిక భరోసా ఇవ్వడానికి ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందన్న భావన ప్రతి ఒక్కరిలో పెరుగుతోంది. అదేవిధంగా కరోనా మహమ్మారి బారిన పడితే ఆసుపత్రిలో వైద్యానికి లక్షలకు లక్షలు ఖర్చు అవుతున్న సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిదన్న భావన ప్రతి ఒక్కరిలోనూ పెరిగింది. దీంతో గతంలో ఇన్సూరెన్స్ ఏజెంట్ ని చూస్తేనే మళ్ళీ కలుస్తా మంటూ పారిపోయేవారు కాస్తా ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసేవారు ఎక్కడ ఉన్నారని వెతుక్కుంటూ వెళ్లి మరీ ఇన్సూరెన్స్ చేస్తున్న పరిస్థితి ఉంది.
ఇన్సూరెన్స్ సంస్థలకు ఫుల్ బిజినెస్ , భీమాపై ప్రజల్లో పెరిగిన అవగాహన
గతంతో పోల్చుకుంటే దాదాపు పది రెట్లు ఎక్కువగా ప్రజలు ఆరోగ్య బీమా, జీవిత భీమాలను చేస్తున్నారు. ఒకప్పుడు ఇన్సూరెన్స్ అంటేనే నిర్లక్ష్యంగా ఉన్న వారు కాస్త ఇప్పుడు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ లు కడుతున్నారు. దీంతో కరోనా కష్టకాలంలో కూడా ఎల్ఐసి తో పాటుగా, పలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు విపరీతంగా బిజినెస్ చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరూ తమ జీవితానికి ఆర్థిక భద్రత అవసరమని భావించే ఆలోచన కల్పించింది కరోనా మహమ్మారి.