మోడీ గారు! మీకు ఇది అర్థమవుతుందా? క్రూడ్ ధరలు పడిపోతున్నాయి, పెట్రోల్ సంగతేమిటి
కరోనా వైరస్ తో ప్రపంచమంతా అతలాకుతలం అయిపోతోంది. అగ్ర రాజ్యం అమెరికా ఐతే చిగురుటాకులా వణికిపోతోంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. దీంతో తానుగా చమురు ధరలు భారీగా పతనం అవుతున్నాయి. చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ముడి చమురు ధరలు సున్నా డాలర్ల కంటే తక్కువకు పడిపోయాయి. అంటే అమ్మకందారే కొనుగోలు దారునికి ఎదురు డబ్బులు ఇచ్చి మరీ సరుకును తీసుకెళ్లమని బ్రతిమలాడే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇది నిజంగా ప్రపంచానికి ఒక సరికొత్త గుణపాఠమే.
ప్రపంచం గురించి కాసేపు పక్కకు పెడితే... మన భారత దేశానికి మాత్రం ఇది ఒక అద్భుతమైన శుభవార్త. ప్రపంచంలో తన చమురు అవసరాలకోసం పూర్తిగా దిగుమతులపై ఆధారపడే అతిపెద్ద దేశాల్లో భారత్ అగ్రభాగాన నిలుస్తుంది. ఏటా చమురు దిగుమతుల కోసం రూ లక్షల కోట్ల విదీశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు ఒక అద్భుత అవకాశం లభిస్తోంది. ఒక బారెల్ చమురు సున్నా డాలర్లకు అందుబాటులోకి వచ్చినప్పుడు, భారీగా చమురును కొనుగోలు చేసి, దానిని వ్యూహాత్మక నిల్వల కింద స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.
జీరో కంటే తక్కువకు చమురు ధరలు, పెట్రోల్కు మనం డబ్బులు చెల్లించవద్దా?
ధరలు తగ్గించాలి...
ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు ఆకాశాన్ని తాకిన సందర్భంలో భారత్ లో పెట్రోలు, డీజిల్ ధరలు కాస్త అందుబాటులోనే ఉండేవి. 2008 లో ఒక బారెల్ చమురు ధర 147 డాలర్లకు చేరుకున్నా... ఇండియా లో పెట్రోల్ ధర రూ 50 లోపే ఉండేది. కానీ ఇప్పుడు అదే చమురు సున్నా డాలర్లకు వస్తున్నప్పుడు కూడా ఇండియా లో లీటర్ పెట్రోల్ రూ 75 వద్ద కొనసాగటం ఏమాత్రం భావ్యం కాదు. పైకి అంతర్జాతీయ ధరల గమనానికి దేశీయ ఇంధన ధరలను అనుసంధానం చేశామని ప్రగల్భాలు పలుకుతుంది ప్రభుత్వం. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బారెల్ రవాణా తో కలిపినా 10 డాలర్లకు మించదు. అంటే దాదాపు గరిష్ట స్థాయి నుంచి 90% భారం తగ్గినట్లే. మరి అందుకు తగినట్లు మన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాల్సిందే కదా? వాస్తవిక పరిస్థితులను పరిగణన లోకి తీసుకుంటే లీటర్ పెట్రోలును రూ 25 కు, డీజిల్ ను అంతకంటే తక్కువ ధరకే అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రూ 7 లక్షల కోట్ల ఖర్చు...
ముందే చెప్పినట్లు ప్రపంచంలోనే చమురును అధిక మొత్తంలో కొనుగోలు చేసే దేశాల్లో భారత్ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. చమురు దిగుమతుల కోసం మన దేశం 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ 7,83,200 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేసింది. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది కాస్త తగ్గి రూ 7,43,000 కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేసింది. గత రెండేళ్లలో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు పతనం అవుతుండటంతో ఈ మనకు కాస్త కలిసివస్తోంది. ఇక ఇప్పుడున్న సిట్యుయేషన్ అయితే జాక్ పాట్ అని చెప్పొచ్చు. ప్రస్తుత పరిణామాలు మరో 5-6 నెలలు కొనసాగినా... 2020-21 ఆర్థిక సంవత్సరంలో మన చమురు దిగుమతుల బిల్లు సగానికిపైగా పడిపోయినా ఆశ్చర్యపడనక్కరలేదు. ప్రభుత్వం మరింత తెలివిడిగా వ్యవహరిస్తే బిల్లు 75% కూడా తగ్గొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఒక్క డాలర్ తగ్గితే రూ 10,000 కోట్లు మిగులు..
అధికారిక అంచనాల ప్రకారమే బారెల్ ముడి చమురు ధర ఒక డాలర్ తగ్గితే ఇండియా కు సాలీనా (ఏడాదికి) రూ 10,000 కోట్లు మిగులుతాయి. మన దేశం రోజుకు సగటున 4.5 మిలియన్ బారెల్స్ ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. గతంలో సగటున ఒక బారెల్ ధర 60 డాలర్లు ఉండేది. ఇప్పుడు అది కాస్తా సున్నాకు తగ్గిపోయింది. అంటే, మీరే లెక్కించండి మన దేశానికి ఎంత విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందో! ఇండియా తన చమురు అవసరాల్లో సుమారు 85% దిగుమతులపైనే ఆధారపడుతుంది. కాబట్టి, ఇప్పటికైనా భారత ప్రభుత్వం సరైన ప్రణాళికలతో ముందుకు సాగి, చమురు వ్యయాన్ని తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో తగ్గిన ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని కోరుతున్నారు. అప్పుడు కరోనా తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కొంత వరకు వేగంగా పుంజుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సో, మోడీ గారూ మీకు ఇది అర్థం అవుతోందా?