Edible Oil: సామాన్యులకు శుభవార్త.. వంట నూనెలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..
గత మార్చి, ఏప్రిల్ లో ఆకాశాన్నంటిన వంట నూనె ధరలు జూలై నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ధరలు భారీగా పెరిగిన దశలో కేంద్రం వంట నూనెల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. దీంతో క్రమంగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే రాయితీతో కూడిన కస్టమ్స్ డ్యూటీని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది.
సుంకం..
2023 మార్చి 31 వరకు రాయితీ కస్టమ్స్ సుంకం కొనసాగుతుందని ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) పేర్కొంది. ప్రస్తుతం 'ముడి' పామాయిల్, సోయాబీన్ నూనె, సన్ ఫ్లవర్ నూనెపై ఎలాంటి దిగుమతి సుంకం లేదు. అయితే 5% అగ్రి సెస్సు, 10 శాతం సంక్షేమ (సోషల్ వెల్ఫేర్) సెస్సును పరిగణనలోకి తీసుకుంటే.. ఈ మూడు రకాల నూనెలపై 5.5 శాతం సుంకం వసూలు చేస్తున్నారు.
ప్రస్తుత సుంకాలే..
ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలీన్, ఆర్బీడీ పామ్ ఆయిల్, ముడి సోయా ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూనెపై ప్రస్తుత సుంకాలే కొనసాగుతాయని పరోక్ష పన్నుల కేంద్ర మండలి ప్రకటించింది.శుద్ధిచేసిన (రిఫైన్డ్) పామోలిన్, పామాయిల్కు బేసిక్ కస్టమ్స్ సుంకం 12.5 శాతం కాగా.. సంక్షేమ సెస్సు 10% వసూలు చేస్తున్నారు.
లీటర్ కు రూ.176..
రిఫైన్డ్ సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెపై బేసిక్ కస్టమ్స్ 17.5 శాతం కాగా.. 10 శాతం సోషల్ వెల్ఫేర్ సెస్సును లెక్కలోకి తీసుకుంటే వర్తించే సుంకం 19.25 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం వేరుశనగ లీటర్ కు రూ.188 ఉండగా.. ఆవ నూనె రూ.172, వనస్పతి రూ. 152, సోయాబీన్ రూ.156, పొద్దుతిరుగుడుపువ్వు రూ.176, పామాయిల్ రూ.136గా ఉంది.