వేతనాలు కట్ చేస్తాం.. జీతాలివ్వం: ఉద్యోగులకు షాక్, ఈ కంపెనీలు మాత్రం శాలరీ పెంచాయి
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అమెరికాలో నిరుద్యోగులు భారీగా పెరిగారు. ఆయా కంపెనీలు ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. ఈ ప్రభావం భారత్ పైన కూడా భారీగానే ఉంది. ఇండియా లాక్ డౌన్ కారణంగా ఎన్నో కంపెనీలు మూతబడ్డాయి. అవకాశమున్న కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. మూతబడిన కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి చాలా తక్కువ. ఇద్దామనుకున్నా ఆ కంపెనీలే నడవలేదు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పటికీ పూర్తి శాలరీలు వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు.
కరోనా ఎఫెక్ట్: క్లిష్ట పరిస్థితుల్లో కీలక నిర్ణయం, వారి శాలరీ 3 రెట్లు పెంపు
శాలరీ కట్ ప్రకటించిన సంస్థలు
కరోనా వైరస్ కారణంగా పర్యాటక రంగం, విమానయానం భారీగా దెబ్బతిన్నాయి. ఈ రంగాల్లో ఉద్యోగాల తొలగింత లేదా వేతనాల తగ్గింపు లేదా వేతనాలు ఆలస్యంగా ఇవ్వడం చోటు చేసుకోనుంది. పలు ఎయిర్ లైన్స్ వేతనాలు కట్ చేస్తున్నట్లు తెలిపాయి. భారత ఇండస్డ్రీ వర్గాల్లో ఇలా ప్రకటన చేసింది మొదట విమానయాన సంస్థలు మాత్రమే.
ఉద్యోగులకు మెయిల్స్ పంపుతున్న కంపెనీలు
21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో నగదు ప్రవాహంపై తప్పకుండా ప్రభావం పడుతుంది. ఉత్పత్తులు నిలిచిపోవడంతో కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనాలకు సంబంధించి మెయిల్స్ పంపిస్తున్నాయి. కరోనా, లాక్డౌన్ కారణంగా సమీప భవిష్యత్తులో ఏ మేరకు ఎలా భారం పడుతుందో వివిరిస్తున్నాయి.
ఉద్యోగుల తొలగింత
ఓ క్యాబ్ అగ్రిగేటర్ గత ఏడాది డిసెంబర్ నెలలోనే 500 మంది ఉద్యోగులను తొలగించింది. అంతేమంది ఉద్యోగులను మరోసారి తొలగించేందుకు సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. మార్చి నుండి రానున్న మూడు నెలల్లో తొలగింపు ఉంటుందని భావిస్తున్నారు.
20 శాతం నుండి 50 శాతం వేతన కోత
ఓ ఫుడ్ డెలివరీ స్టార్టప్ తన ఉద్యోగులకు వేతన కట్ గురించి మెయిల్స్ పంపించింది. ఇది ముఖ్యంగా క్లౌడ్ కిచెన్ను ఆపరేట్ చేస్తోంది. ఉద్యోగుల వేతనాలను ఏప్రిల్ నెలకు గాను 20 శాతం నుండి 50 శాతం మేర తగ్గిస్తామని ఈ స్టార్టప్ కంపెనీ తన ఉద్యోగులకు మెయిల్స్ పంపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం లేక నగదు ప్రవాహం లేదని తెలిపింది.
ఉద్యోగాలు తొలగించం..
వేతనాల్లో కోత విధిస్తామని, కానీ ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగాలు తొలగించమని ఉద్యోగులకు కొంతలో కొంత ఊరట కల్పించింది. పరిస్థితి సద్దుమణిగితే మార్చి, ఏప్రిల్ వేతనాల తగ్గింపు భర్తీను పూర్తి చేస్తామని తెలిపింది.
వేతన తగ్గింపు ఆందోళన
ఇక, నాలుగు పెద్ద అకౌంటింగ్ కంపెనీల్లోని రెండు కూడా కరోనా వైరస్ ప్రభావంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో ఓ కంపెనీ శాలరీ కట్ ఉండవచ్చునని చెబుతోంది. మరో సంస్థ భాగస్వాములు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.
కొత్త ఉద్యోగాలు, వేతనాల పెంపు వాయిదా
ముంబైకి చెందిన ఓ అకౌంటింగ్ సంస్థ ఏఫ్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వివిధ నిర్ణయాలను వాయిదా వేసింది. ఇందులో కొత్త ఉద్యోగులను తీసుకోవడం, ఉద్యోగులకు వేతన పంపు, బోనస్లు.. ఇలా అన్నింటిని వాయిదా వేయాలని నిర్ణయించింది.
ఇవన్నీ వాయిదా..
అకౌంటింగ్ కంపెనీ పీడబ్ల్యూసీ ఇండియా టెర్రిటరీ సీనియర్ పార్ట్నర్, చైర్మన్ శ్యామల్ ముఖర్జీ మాట్లాడుతూ... ఉద్యోగులను, మా సంస్థను స్థిరంగా ఉంచేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని ఇందుకు కొన్ని మధ్యంతర విధానాలు రూపొందించామని చెప్పారు. పరిస్థితి కొలిక్కి వచ్చే వరకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బోనస్ వాయిదా వేయడం అన్నారు.
ఎయిర్ లైన్స్ కోత ప్రకటన
ఎయిర్ లైన్స్ ఇప్పటికే వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించాయి. ఇండిగో తన కంపెనీ సీఈవో సహా అందరికీ 25 శాతం వరకు వేతనాల కోత విధిస్తున్నట్లు తెలిపింది. గోఎయిర్ కూడా మార్చి నెలకు గాను వేతనాలు కట్ అవుతాయని తెలిపింది. విస్తారా 10 శాతం వేతనాలు కట్ చేయడంతో పాటు కొంతమంది స్టాఫ్ను వేతనం లేని సెలవులపై వెళ్లాలని కోరింది. ఎయిరిండియా కూడా భత్యాలలో 10 శాతం వేతనం కట్ చేసింది.
కాగ్నిజెంట్, ఫేస్బుక్ అధిక వేతనం
అయితే ఐటీ, సాఫ్టువేర్ కంపెనీలు కొన్ని మాత్రం తమ ఉద్యోగులకు అదనపు వేతనాలు ఇస్తున్నాయి. ఉద్యోగులు క్లిష్ట పరిస్థితుల్లో ఉండటంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో పాటు కొన్ని కంపెనీలు వేతనాలు కొంత ఎక్కువగా ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు ప్రస్తుత పరిస్థితుల్లో 25 శాతం బేసిక్ పే ఎక్కువగా ఇస్తామని ప్రకటించింది. ఇండియాలో 45,000 మంది కాగ్నిజెంట్ ఉద్యోగులకు దీని వల్ల ప్రయోజనం కలగనుంది. అలాగే ఫేస్బుక్ ఒక్కో ఉద్యోగికి 1,000 డాలర్లు అదనంగా ఇస్తున్నట్లు తెలిపింది.