పండుగ షాపింగ్ కు సామాన్యులు దూరం .. ఆకాశాన్నంటిన నిత్యావసరాలు ,కూరగాయల ధరలే కారణం
ఏం కొనేటట్టు లేదు ..ఏం తినేటట్టు లేదు అన్నట్టు తయారైంది తాజా పరిస్థితి. ఒకపక్క దగ్గరపడుతున్న దసరా, దీపావళి పండుగలు, మరోపక్క కరోనా కారణంగా కుదేలైన సామాన్యుల ఆర్థిక పరిస్థితులు వెరసి ప్రజలకు పండుగ కష్టాలు మొదలయ్యాయి. విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, వంట నూనెలు ,కూరగాయల ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కూరగాయలు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇక నిత్యవసర వస్తువులు సరేసరి. వంటనూనెల ధరలు పెట్రోల్ లానే మండిపోతున్నాయి .
కరోనాకు ముందు ధరలకు ఇప్పుడు ధరలకు బోలెడు వ్యత్యాసం
కరోనా వ్యాప్తికి ముందు ధరలను, ప్రస్తుతమున్న ధరలను పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక సామాన్యుల సంపాదన అంతంత మాత్రంగా తయారయింది. కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధిని కోల్పోయి బతుకు జీవుడా అంటూ పొట్ట తిప్పల కోసం నానా చావు చస్తున్నారు. ఇలాంటి సమయంలో పండుగలు కూడా సామాన్యుల ఆర్థిక దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి. సామాన్యుల జీవితాలను వెక్కిరిస్తున్నాయి.
విపరీతంగా పెరిగిన వంటనూనెలు , నిత్యావసరాలు , కూరగాయల ధరలు
నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చుంటే, వంట నూనెలు, కూరగాయల ధరలు కూడా ఏ మాత్రం తగ్గకుండా ధరాఘాతం శరాఘాతంగా మారుతోంది. కూరగాయల ధరలు 37 శాతం పెరిగాయంటే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పావు కిలో కూరగాయలు కొనాలంటే 20 నుండి 30 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఏ కూరగాయలు పట్టుకున్నా సామాన్యులకు భారంగా మారుతోంది. ఇక పప్పుదినుసులు ధరలు చూస్తే 12.53 శాతం పెరిగాయి. ఉల్లిపాయలు 31.64 శాతం పెరగగా, ఆహార ఉత్పత్తులు ప్రతి ఒక్క దాని పై కొనలేనంతగా ధరలు పెరిగాయి.
కొనలేనంతగా పెరిగిన వంట నూనెలు
ఇక వంటనూనెల ధరలు గతంలో ఉన్న ధరలతో పోలిస్తే 30 నుండి 45 రూపాయల మేర పెరిగినట్లుగా తెలుస్తోంది. విపరీతంగా పెరిగిన ధరలతో సామాన్యుడు విలవిలలాడుతుంటే, కొండెక్కి కూర్చున్న ధరలను కిందికి దించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రజలకు ఏమాత్రం రుచించడం లేదు. అసలే కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేయలేని దయనీయమైన స్థితి రావడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈసారి పండుగలకు కనిపించని కొనుగోళ్ళ హడావిడి
కనీసం పండుగకు కడుపునిండా తిందామన్నా విపరీతంగా పెరిగిన ధరలతో సాధ్యం కాదని లోలోపల కుమిలిపోతున్నారు. పట్టించుకోవాల్సిన పాలకులు అవేవీ పట్టనట్టు వ్యవహరిస్తుంటే పండుగలు ఎందుకు వస్తాయా అని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు . గతంలో పండుగలు వస్తున్నాయంటే పిండివంటలు ఘుమఘుమలాడేవి.కొత్త బట్టల కొనుగోళ్ళు , పండుగ సరుకుల కొనుగోళ్ళ హడావిడి మార్కెట్ లో కనిపించేది . కానీ ఈ సారి పండుగకు అలంటి పరిస్థితి లేదని అటు వ్యాపారులు కూడా చెప్తున్నారు.