ఉద్యోగులకు కాగ్నిజెంట్ గుడ్న్యూస్, ఏప్రిల్లో అదనపు శాలరీ
దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఇండియా, పిలిప్పైన్స్ దేశాల్లోని తమ ఉద్యోగులకు ఏప్రిల్ నెలలో 25 శాతం అదనపు వేతనం ఇస్తామని తెలిపింది. అసోసియేటెడ్ లెవల్ నుండి కిందిస్థాయి ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఐటీ సహా దాదాపు అన్ని రంగాల ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగుల సేవలను గుర్తించి బేసిక్ శాలరీపై 25 శాతం అదనంగా ఇస్తామని తెలిపింది.
ట్విస్ట్: మీరు నిజంగానే 3 నెలలు EMI కట్టక్కర్లేదా, క్రెడిట్ కార్డు బిల్లు పరిస్థితేమిటి?
లక్షా ముప్పైవేల మంది ఉద్యోగులకు ఊరట
కాగ్నిజెంట్ నిర్ణయం వల్ల భారత్లోని 1,30,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ మేరకు కాగ్నిజెంట్ సీఈవో బ్రయాన్ హంపైర్స్ మాట్లాడుతూ.. అదనపు చెల్లింపు ఏప్రిల్ పేమెంట్తో పాటు ఉంటుందని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచానికి ఊహించని దెబ్బ అన్నారు. అన్ని సంస్థల మాదిరిగా కాగ్నిజెంట్ కూడా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. లండన్, ముంబై, మనీలా, న్యూయార్క్ ఇలా అంతటా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఉద్యోగుల సహకారం
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం కనిపిస్తోందని చెప్పారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగులు పరస్పర సహకారంతో క్లయింట్లకు సేవలు అందిస్తున్నారని, ఇందుకు వారికి కృతజ్ఞతలు అన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిందని, పిలిప్ఫైన్స్ నేషనల్ ఎనర్జెన్సీ ప్రకటించిందని దీనికి తాము మద్దతిస్తున్నామని తెలిపారు.
వర్క్ ఫ్రమ్ హోమ్
కరోనా మహమ్మారి ప్రభావం ఇండస్ట్రీపై చాలా ఉందని, అలాగే ఖాతాదారుల అవసరాలు తీర్చాల్సి ఉందని, దీనిని గుర్తించిన తాము ముందే వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రయత్నించామని తెలిపారు. అలాగే తమ డేటాను కాపాడుకుంటామని, కస్టమర్ల గోప్యతను రక్షిస్తామన్నారు.
ల్యాప్టాప్స్ అందించాం..
గత కొన్ని వారాలుగా కొత్త ల్యాప్టాప్స్ ఇవ్వడం, డెస్ట్ టాప్స్ అందించడం, వాటిని ఉద్యోగుల ఇళ్లకు తరలించడం చేశామని తెలిపారు. అలాగే అదనపు బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీ ఇతర అవసరాలను తీర్చామన్నారు. అదే సమయంలో క్లయింట్ల అనుమతులు, భద్రతా ప్రోటోకాల్స్ పాటించామని చెప్పారు.
ఉద్యోగుల సేవలు గుర్తించి..
ఇండియా, పిలిప్పైన్స్లో తమ ఉద్యోగుల సేవలను గుర్తించి వారికి కృతజ్ఞతగా బేసిక్ పేలో 25 శాతం అదనంగా ఇస్తామని తెలిపారు. ఇండియా కాగ్నిజెంట్లో డిసెంబర్ 2019 నాటికి 2,03,700 మంది ఉన్నారు. ఇందులో అదనపు వేతనానికి అర్హత ఉన్నవారు 1,30,000 మంది ఉన్నారు. అలాగే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కార్పోరేట్ సామాజిక బాధ్యతగా తమ వంతు సహకారం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.