కాగ్నిజెంట్లో లక్షకు పైగా ఉద్యోగాలు, 30,000 మంది ఫ్రెషర్లకు ఛాన్స్
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్లో లక్షకు పైగా ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ ఏడాది ఈ ఐటీ దిగ్గజం లక్ష మంది అనుభవజ్ఞులను, మరో 30,000 ఫ్రెషర్లను నియమించుకోనుంది. ఇటీవల సాఫ్టువేర్ రంగంలో భారీ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. కరోనా తర్వాత డిజిటల్ టెక్నాలజీకి మరింత ప్రాధాన్యత పెరగడంతో ఆ రంగంలో డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కాగ్నిజెంట్ కూడా ఈ ఏడాది పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతోంది.
ఉద్యోగుల వలసలు
కాగ్నిజెంట్ ఉద్యోగుల విషయంలో ఓ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ కంపెనీ నుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి వెళ్తున్నారు. దీంతో నియామకాలపై దృష్టి సారించింది. ఉద్యోగుల వలసలను నేపథ్యంలో ఈ ఖాళీలను పూరించేందుకు కంపెనీ ఈ ఏడాది 1,00,000 మందిని తీసుకోనుంది. ఈ మేరకు గురువారం కాగ్నిజెంట్ ప్రకటించింది. 2021లో అనుభవం కలిగిన నిపుణులతో పాటు 30,000 మంది ప్రెషర్స్ను తీసకుంటామని తెలిపింది. 2022లో 45,000మంది కొత్త గ్రాడ్యుయేట్స్ను చేర్చుకుంటామని వెల్లడించింది.
భారత్లో 2 లక్షల మంది
జూన్ త్రైమాసిక ఫలితాలను వెల్లడి అనంతరం ఓ భేటీలో కంపెనీ సీఈవో బ్రియాన్ హాంప్షైర్స్ మాట్లాడారు. ఉద్యోగుల వలస ప్రధాన ఆందోళనగా చెప్పారు. ఈ జూన్ త్రైమాసికంలో కంపెనీ నుండి వలసలు రికార్డ్స్థాయిలో 31 శాతానికి పెరిగాయి. ప్రస్తుతం కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మేర ఉద్యోగులు ఉండగా, భారత్లో 2 లక్షలమంది ఉద్యోగులు ఉన్నారు. వలసలు తగ్గించేందుకు వేతనాల పెంపు, ప్రమోషన్స్, నైపుణాలను పెంపొందించడం, జాబ్ రొటేషన్స్ వంటి చర్యల్ని చేపడుతున్నారు.
కంపెనీ నికర లాభం
ఇదిలా ఉండగా, ఈ కంపెనీ జూన్ త్రైమాసికంలో 512 మిలియన్ డాలర్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020 ఇదే త్రైమాసికంలో ఆర్జించిన 361 మిలియన్ డాలర్ల నికర లాభంతో పోలిస్తే ఇది 41.8 శాతం అధికం. కంపెనీ ఆదాయం 400 కోట్ల డాలర్ల నుంచి 14.6 శాతం వృద్ధి చెంది 460 కోట్ల డాలర్లకు చేరుకుంది.