హమ్మయ్య.. బొగ్గు సరఫరా మెరుగుపడుతోంది: ఐనా.. కాస్త చూసుకొని విద్యుత్ను వాడండి!
బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు దాదాపు రెండు వారాలుగా అంధకారంలోకి వెళ్లాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాల్లో పలు పరిశ్రమలు మూతబడ్డాయి. బొగ్గు కొరత, ధరల పెరుగుదల నేపథ్యంలో వచ్చే నెల పరిశ్రమలను మూసివేస్తున్నట్లు గుజరాత్ టెక్స్టైల్ ప్రాసెసింగ్ అసోసియేషన్(SGPTA) తెలిపింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల విద్యుదుత్పత్తి తగ్గి భారత్ అంధకారంలోకి వెళ్లడంతో పవర్, కోల్ మంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గు కొరత ఉందనే ఆందోళనల నేపథ్యంలో సోమవారం విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషిలతో సమావేశమయ్యారు. దేశంలో బొగ్గు నిల్వలపై చర్చించారు. ఈ భేటీలో ఎన్టీపీసీ అధికారులు ఉన్నారు.
కాస్త చూసుకోండి..
దేశంలోని 135 బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్స్లో సగానికి పైగా ప్లాంట్స్లో నిల్వలు మూడు రోజులలోపు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు మాత్రమే ఉందని తెలుస్తోంది. ఈ విద్యుత్ కేంద్రాల్లో దేశానికి అవసరమైన 70 శాతం విద్యుదుత్పత్తి జరుగుతోంది. వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధరలు పెరిగాయి. ప్రధానంగా ఇండోనేషియా నుండి బొగ్గు వస్తుంది. ఈ ధరలు పెరిగాయి. దీంతో బొగ్గు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ నెల 8వ తేదీన విద్యుత్ వినియోగం 3,900 మెగా యూనిట్లుగా ఉంది. ఈ నెల మొదటి 9 రోజుల్లో ఇది అత్యధికం. విద్యుత్ కొరత కారణంగా పంజాబ్, జార్ఖండ్, బీహార్, రాజస్థాన్లలో పరిస్థితి దారుణంగా ఉంది. పరిమిత బొగ్గు లభ్యత కారణంగా ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఆరు గంటల మధ్య విద్యుత్ సరఫరా కీలకం. దీంతో విద్యుత్ వినియోగదారులు వినియోగం పట్ల కాస్త ఆచితూచి వ్యవహరించాలని చెబుతున్నారు. ఢిల్లీలో విద్యుత్ సరఫరా చేస్తోన్న టాటా పవర్ అనుబంధ టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కూడా వినియోగదారులకు విద్యుత్ వినియోగం పట్ల విజ్ఞప్తి చేసింది.
రెండు రోజులుగా కాస్త ఊరట
గత రెండు రోజులుగా బొగ్గు సరఫరా కాస్త పెరగడంతో విద్యుత్ ఉత్పత్తి కొద్దిగా మెరుగుపడుతోంది. డిమాండ్కు తగిన విద్యుత్ ఉత్పత్తి-సరఫరా కావాలంటే ఈ వారం చివరి నాటికి అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్ నుండి అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేస్తున్నారు. విద్యుత్ వినియోగ డిమాండ్ను తీర్చేందుకు వ్యవసాయానికి వివిధ రాష్ట్రాల్లో రెండు గంటల పాటు విద్యుత్ కోతను విధిస్తున్నారు. అవసరమైన సమయంలో మాత్రమే ఇస్తున్నారు. బొగ్గు కొరత కారణంగా గత రెండు వారాలుగా విద్యుత్ ఉత్పత్తి క్షీణించింది. దీంతో పలు ప్రభుత్వ యూనిట్లు, ప్రయివేటు స్టేషన్స్ క్లోజ్ అయ్యాయి. మహారాష్ట్రలో 1860 మెగావాట్స్ సామర్థ్యం కలిగన ఆరు ప్రభుత్వ యూనిట్లు, 1450 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు ప్రయివేట్ యూనిట్లు క్లోజ్ అయ్యాయి. పలు రాష్ట్రాల్లోను ఇదే పరిస్థితి. కేంద్రం దీనిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమిత్ షా మంత్రులు, అధికారులతో భేటీ అయ్యారు. దీంతో కొన్ని యూనిట్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటీవల బొగ్గు ఉత్పత్తి పెరుగుతోంది.
అధిక ధరకు కొనుగోలు
మహారాష్ట్ర వంటి చోట్ల ఓపెన్ మార్కెట్ నుండి అధిక ధరలకు విద్యుత్ను కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్ర అక్టోబర్ 1వ తేదీ నుండి 800MW నుండి 2200 MW వరకు విద్యుత్ను కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.140 కోట్లు ఖర్చు చేసింది. మహారాష్ట్రలో విద్యుత్ డిమాండ్ 17,500-18,000 MW మధ్య ఉంది. అక్టోబర్ నెలలో ఇది 22,000MW యూనిట్లకు కూడా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పండుగ సీజన్ కావడం, వ్యవసాయ కార్యకలాపాలు పెరగడం వంటి అంశాలు విద్యుత్ డిమాండ్ను పెంచుతాయని భావిస్తున్నారు. గుజరాత్లో 1850 మెగావాట్ల విద్యుత్, పంజాబ్లో 475 మెగావాట్లు, రాజస్థాన్లో 380 మెగావాట్లు, మహారాష్ట్రలో 760మెగావాట్లు, హర్యానాలో 380 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు టాటా పవర్ కాంట్రాక్ట్ పొందింది. అయితే గుజరాత్లో ముంద్రా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రంలో కరెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది.