పెట్రోల్, డీజిల్, గ్యాస్ తర్వాత ఢిల్లీలో ఆ ధరలు షాకిచ్చాయి
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ఉత్పత్తుల ధరలు పెరగడంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్తో పాటు ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ (కంప్రెస్ట్ నేచరల్ గ్యాస్), గృహ అవసరాల కోసం వినియోగించ పైప్డ్ నేచరల్ గ్యాస్ (పీఎన్జీ) రేట్లు పెరిగాయి. ఈ మేరకు చమురు రంగ సంస్థలు మంగళవారం నుండి ఈ పెంపును అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. కాగా, నేడు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
సీఎన్జీ 70 పైసల వరకు, పీఎన్జీ , 91 పైసల వరకు పెంచుతున్నట్లు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ తెలిపింది. ఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) మొత్తానికీ సీఎన్జీ, పీఎన్జీని సరఫరా చేసే సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL)కు అనుబంధంగా పని చేస్తుంది. ఈ ధరల పెంపు ప్రస్తుతం ఢిల్లీకి పరిమితమైంది. దశలవారీగా అన్ని నగరాల్లోనూ అమలు చేయనున్నాయి.
కొత్తగా సవరించిన రేట్ల ప్రకారం- ఢిల్లీలో సీఎన్జీ ధర 43.40కి, పీఎన్జీ ధర 28.41కు చేరుకుంది. స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ ప్రకారం పీఎన్జీ ధరను వసూలు చేస్తారు. సవరించిన రేట్ల ప్రకారం నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లల్లో సీఎన్జీ కేజీ ఒక్కింటికి రూ.49.08, కాన్పూర్, హమీర్పూర్, ఫతేపూర్లల్లో రూ.60.50గా ఉంది. రెవారీ, కర్నాల్లల్లో పీఎన్జీ రేట్లు రూ.28.46, మీరట్లో రూ.32.67గా ఉంది. ఢిల్లీ-NCR, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, రేవారీ తదితర ప్రాంతాల్లో 16 లక్షల ఇళ్లకు ఇంద్రప్రస్థ గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ను సరఫరా చేస్తోంది.