కర్నూలులో రూ.15,000 కోట్ల భారీ హైబ్రీడ్ ప్రాజెక్ట్: వైఎస్ జగన్ శంకుస్థాపన
అమరావతి: సంప్రదాయేతర ఇంధన వనరుల రంగానికి చెందిన గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్.. ఏపీలో భారీ పెట్టుబడులను పెట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. హైబ్రీడ్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పనుంది. సౌర విద్యుత్, పవన్ విద్యుత్ యూనిట్లను స్థాపించనుంది. ఈ ప్రాజెక్ట్ విలువ 15,000 కోట్ల రూపాయలు. 5,410 మెగావాట్ల విద్యుత్ను సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి చేయాలనేది ఈ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే మూడు సంవత్సరాల వ్యవధిలో ఈ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుంది.
పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి గ్రీన్కో దృష్టి సారించింది. రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ కంపెనీకి విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు ఉన్నాయి. రెన్యూవబుల్ సెగ్మెంట్తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో హైడల్ పవర్ ప్లాంట్లను కూడా నెలకొల్పింది. 2030 నాటికి ఒక గిగావాట్ సామర్థ్యం గల సంప్రదాయేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. దీనికోసం అయానా రెన్యూవబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి పని చేస్తోంది.
క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్లో రెండు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ ఏకతాటిపైకి రావడం ఇదే తొలిసారి కూడా. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోన్న గ్రీన్కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 10 గిగావాట్ స్టోరేజీ కెపాసిటీతో తన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై దృష్టి సారించింది. తాజాగా 5,410 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేయనుంది.
కర్నూలు శివార్లలోని ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా సమీపంలోని మజారా వద్ద ఈ భారీ హైబ్రీడ్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ హైబ్రీడ్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం ఆయన మంగళవారం ఉదయం కర్నూలుకు బయలుదేరి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ను ముఖ్యమంత్రి కార్యాలయం ఇదివరకే విడుదల చేసింది.
ఉదయం 9.35 నిమిషాలకు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వైఎస్ జగన్ బయలుదేరుతారు. 10 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఓర్వకల్లు విమానాశ్రయానికి బయలుదేరుతారు. 10.50 నిమిషాలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11.15 గంటలకు ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా హెలిప్యాడ్కు చేరుకుంటారు. 11.35 గంటలకు ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. 11.35 నుంచి 12.15 గంటలకు ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.