స్తంభించిపోనున్న టాప్ బ్యాంక్ ఆన్లైన్ సర్వీసులు
ముంబై: సిటీబ్యాంక్ ఆన్లైన్ సేవలు స్తంభించిపోనున్నాయి. సోమవారం నాడు 45 నిమిషాల పాటు ఈ బ్యాంక్కు సంబంధించిన అన్నిరకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నీ నిలిచిపోనున్నాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యాప్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనున్నట్లు సిటీబ్యాంక్ తెలిపింది. తెల్లవారు జామున 3 గంటల నుంచి 3:45 నిమిషాల వరకు ఆన్లైన్ సేవలు ఏవీ గానీ అందుబాటులో ఉండవని తెలిపింది. మెయింటెనెన్స్ కోసమే.. వాటిని నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు తన ఖాతాదారులందరికీ అధికారిక ఇ-మెయిల్ను పంపించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యాప్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్, సెల్ఫ్ సర్వీస్ రిక్వెస్టులు, 24/7 సిటీ ఫోన్ సేవలు.. ఇవన్నీ ఈ 45 నిమిషాల పాటు అందుబాటులో ఉండవని తెలిపింది. మెయింటెనెన్స్ పనులు పూర్తయిన తరువాతే.. పునరుద్ధరిస్తామని పేర్కొంది. సిటీబ్యాంక్ కొత్తగా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
సిటీబ్యాంక్ను లీడ్ చేస్తోన్న సిటీగ్రూప్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్.. కొత్త దేశాలకు తన వ్యాపార పరిధిని విస్తరించుకోనుంది. ఆసియాలో భారత్ సహా 13 దేశాలకు ఇప్పటికే ఈ బ్యాంక్ తన సేవలను విస్తృతం చేసింది. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ రీజియన్లలో కొత్త కార్యాలయాలను నెలకొల్పనుంది. యూరప్, మధ్య తూర్పు దేశాల్లో సిటీబ్యాంక్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆఫ్రికన్ రీజియన్లో ఇప్పటిదాకా అడుగు పెట్టని కొన్ని వర్ధమాన దేశాల్లో ఎంట్రీ ఇవ్వనుంది.
దేశంలో కొత్తగా లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటోంది. దీనికోసం కొన్ని టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలతో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదర్చుకోవాలని భావిస్తోంది. రియల్ ఎస్టేట్ సెక్టార్లో రిటైల్ బిజినెస్ను పెంచుకోవడంలో భాగంగా- ఈ లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేయనుంది. సిటీబ్యాంక్ ద్వారా అద్దెను చెల్లించే వారికి లీజ్ అమౌంట్లో డిస్కౌంట్ ఇవ్వాలనేది దీని ఉద్దేశం.