ఒక్క కంపెనీ గుప్పిట్లో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్: ఆ కంపెనీ ఏమిటంటే?
వినడానికి ఆశ్చర్యంగా ఉందా... కానీ ఇది నిజమే. చైనాకు చెందిన ఒక్క కంపెనీ మన దేశ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో మెజారిటీ వాటాను కలిగి ఉంది. ఈ విషయం ఇప్పటివరకు చాలా మందికి తెలియదు. కానీ ఆ కంపెనీకి చెందిన బ్రాండ్లను మాత్రం మనం రోజు చూస్తున్నాం.. విస్తృతంగా వాడుతున్నాం. ఆ కంపెనీ ఏమిటో ఇప్పటికైనా మీకు తట్టిందా. ఆ కంపెనీ పేరు బీబీకే ఎలక్ట్రానిక్స్. చైనాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ ఇది. ఈ కంపెనీకి చెందిన బ్రాండ్లే.. వివో, ఒప్పో, వన్ ప్లస్, రెడ్ మీ లు. ప్రస్తుతం ఈ బ్రాండ్ల మార్కెట్ వాటా దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో 40 శాతంగా ఉందట. ఏడాది క్రితం ఈ బ్రాండ్ల మార్కెట్ వాటా కేవలం 20 శాతం వరకు మాత్రమే ఉండేది.
ఎక్కువ డబ్బులు ఇస్తే ... ఏం చేసారో చూడండి!
ఏ కంపెనీ వాటా ఎంతంటే...
* ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) త్రైమాసిక మొబైల్ ఫోన్ ట్రాకర్ ప్రకారం... భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో బీబీకే ఎలక్ట్రానిక్స్ వాటా దాదాపు 40 శాతం ఉంది.
* చైనాకే చెందిన మొబైల్ ఫోన్ల కంపెనీ షామీ మార్కెట్ వాటా 27 శాతం, దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ వాటా 19 శాతంగా ఉంది.
* దేశీయ మార్కెట్లో వివో వాటా 15.2 శాతం, రియల్ మీ, ఒప్పో వాటా వరుసగా 14.3 శాతం, 11.8 శాతంగా ఉంది. ఈ మూడు బ్రాండ్ల మార్కెట్ వాటా ఏడాది క్రితం 21 శాతం కన్నా ఎక్కువ ఉండేది.
దూకుడుగా
* చైనా మొబైల్ ఫోన్లు అంటేనే చవక.. క్వాలిటీ ఉండదు.. ఎక్కువ రోజులు పని చేయవు అన్న పేరు మొదట్లో ఉండేవి. కొంత మంది వినియోగదారుల్లో ఉన్న ఇలాంటి భావనను తొలగించడానికి చైనా కంపెనీలు పక్కా ప్రణాళికలతో మార్కెట్ లోకి ప్రవేశించాయి. అన్ని వర్గాల కస్టమర్ల కు అనుగుణమైన ఫోన్లను తీసుకు రావడంపై ద్రుష్టి పెట్టాయి.
* మొదట ఆన్ లైన్ ద్వారా దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన ఈ కంపెనీలు క్రమంగా ఆఫ్ లైన్ రిటైల్ మార్కెట్లోకి అరంగేట్రం చేశాయి. భారీ మొత్తంలో ప్రకటనల కోసం పెట్టుబడులు పెట్టాయి. తక్కువ ధరలకే మొబైల్ ఫోన్లను ఇస్తుండటంతో జనాలు ఎగబడి కొనుగోళ్లు చేస్తున్నారు.
బహుళ బ్రాండ్ల వెనుక వ్యూహం...
* ఒకటే కంపెనీకి విభిన్న బ్రాండ్లు ఎందుకు అన్న సందేశం చాలా మంది వినియోగదారుల్లో వస్తుంది. కానీ ఇలా విభిన్న బ్రాండ్ల ద్వారానే కంపెనీలు మార్కెట్లో విస్తరిస్తున్నాయి. ఒక్కో బ్రాండు కింద ఒక్కో రకమైన మొబైల్స్ ను కంపెనీ తీసుకువస్తుంది. దీనివల్ల ఎక్కువ మంది కస్టమర్లను సంపాదించుకునే అవకాశం ఉంటుంది. దుకాణంలోకి వెళ్లిన కస్టమర్ అక్కడ అక్కడ ఉండే పలు రకాల బ్రాండ్లను చూస్తుంటాడు. ఆ తర్వాత ఏదో ఒక దాన్ని ఎంచుకుంటాడు. అయితే కస్టమర్ ఇతర కంపెనీ బ్రాండుకు మారకుండా తమ కంపెనీకి చెందిన ఏదో ఒక బ్రాండును కొనుగోలు చేయాలన్నదే విభిన్న బ్రాండ్ల వెనుక వ్యూహం.
దేశీయ బ్రాండ్లకు దెబ్బ
తొలినాళ్లలో విదేశీ కంపెనీల మొబైల్ ఫోన్ల ధరలు దేశీయ బ్రాండ్లతో పోల్చితే ఎక్కువ ధర ఉండేవి. అయితే చైనా తదితర దేశాల కంపెనీలు మనదేశంలోనే తమ మొబైల్ ఫోన్లను తయారు చేయడం ప్రారంభించిన తర్వాత వీటి ధరలు కూడా భారీగా దిగివచ్చాయి. కొత్త ఫీచర్లు, తక్కువ ధర ఉండటం వల్ల ఎక్కువ మంది కస్టమర్లను కంపెనీలు ఆకట్టుకునే అవకాశం ఏర్పడింది. దీంతో దేశీయ కంపెనీలైన మైక్రోమాక్స్, లావా, ఇంటెక్స్, సెల్ కాన్ వంటి కంపెనీల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. పలు ఇతర దేశాల కంపెనీలు కూడా చైనా కంపెనీల ధాటికి తట్టుకోలేక పోతున్నాయి.
భారీగా పెట్టుబడులు
మనదేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉంది. ఇంత పెద్ద దేశంలో మొబైల్ ఫోన్లకు అపార అవకాశాలు ఉన్నాయి. అందుకే చైనా కంపెనీలు మన దేశ మార్కెట్లను వదలడం లేదు. ఇక్కడే మొబైల్ ఫోన్లను తయారు చేయడంతో పాటు పరిశోధనా, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. అంతే కాకుండా సొంత స్టోర్లను కూడా ఏర్పాటు చేసుకుంటూ క్రమంగా విస్తరిస్తున్నాయి.