కరోనా ఎఫెక్ట్: దెబ్బతిన్న భారత ఎఫ్ అండ్ ఎఫ్ రంగం... చైనాకు అనుకూలం!
కరోనా వైరస్ దెబ్బకు భారత ఫ్రాగ్రెన్సు అండ్ ఫ్లేవర్స్ (ఎఫ్ అండ్ ఎఫ్) రంగం తీవ్రంగా దెబ్బతింది. దేశంలో సుదీర్ఘకాలం పాటు లాక్ డౌన్ విధించటంతో ఈ రంగం ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గ్లోబల్ మార్కెట్లలో మన దేశ ఎఫ్ అండ్ ఎఫ్ రంగ ఉత్పత్తులకు విపరీతమైన ఆదరణ ఉంది. కానీ, ప్రస్తుతం మన దేశం లో ఈ రంగ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించి పోవటంతో చైనా కు మేలు జరుగుతోంది. మన కంపెనీలకు రావాల్సిన ఆర్డర్లు ఇప్పుడు చైనా కు వెళుతున్నాయి.
మన దేశ సుగంధ, రుచిగల ప్రొడక్టుల మార్కెట్ (ఎఫ్ అండ్ ఎఫ్) 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ 3,750 కోట్ల) గా ఉంది. ఏటా ఈ రంగం 10% నికి పైగా వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. కానీ ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఇండియా లో కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల 80% ఉత్పత్తి నిలిచిపోయిందని ఫ్రాగ్రెన్సెస్ అండ్ ఫ్లేవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏఎఫ్ఏఐ) ప్రెసిడెంట్ రిషబ్ కొఠారి తెలిపారు.
దీంతో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. దీంతో మనకు పోటీగా ఉన్న చైనా కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి ఆ రంగాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
అన్నిటా వినియోగం...
మనం రోజు వారీగా ఉపయోగించే సబ్బులు, టూత్ పేస్ట్ నుంచి ఫుడ్ ఐటమ్స్, బిస్కెట్లు, చాకోలెట్లు, మెడిసిన్ ఇలా అనేక రకాల ప్రొడెక్టుల్లో ఎఫ్ అండ్ ఎఫ్ ఉత్పత్తులను కలుపుతారు. దీంతో ఆయా ప్రొడక్టులకు తగిన రంగులు, రుచి, సువాసన లభిస్తోంది. దేశంలో సుమారు 1,000 కి పైగా చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఈ రంగంలో సేవలు అందిస్తున్నాయి.