China-Taiwan: విషం కక్కుతున్న చైనా.. తైవాన్పై భారీగా ఆంక్షలు.. ఆట మెుదలెట్టిన డ్రాగన్..!
China-Taiwan: చైనా, తైవాన్ ల మధ్య చాలా కాలంగా అనేక సమస్యలు ఉన్నాయి. అయితే తైవాన్ కు మద్దతుగా అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ ఆ దేశంలో తాజాగా పర్యటించడం చైనాకు అస్సలు మింగుడుపడటం లేదు. డ్రాగన్ దేశం ఆగ్రహంతో ఊగిపోతోంది. సమరానికి సిద్ధమంటూ అనేక ప్రకటనలు సైతం చేసేసింది.
చైనా ఆంక్షణ అస్త్రం..
ఈ చర్యలకు ప్రతిస్పందనగా 21 చైనా సైనిక విమానాలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ దీనిని ఖండించడంతో ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ తరుణంలో.. చైనా ప్రభుత్వం తైవాన్పై వాణిజ్య ఆంక్షలు విధించడం ప్రారంభించింది. మొదటి దశగా తైవాన్కు ఇసుక ఎగుమతిపై నిషేధం విధిస్తూ చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఫుడ్ ఉత్పత్తుల నిలిపివేత..
చైనా మంగళవారం అకస్మాత్తుగా ఎటువంటి ముందస్తు నోటీసులూ లేకుండానే తైవాన్ ఫుడ్ కంపెనీల నుంచి ఉత్పత్తులను కొనుగోలను నిలిపివేసింది. దీంతో.. తైవాన్ నుంచి చైనాకు ఎగుమతి అయ్యే టీ, డ్రై ఫ్రూట్స్, తేనె, కోకో బీన్స్, కూరగాయలు, 700 కంటైనర్ల చేపలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దాదాపు 35 తైవాన్ కంపెనీల నుంచి దిగుమతులపై చైనా తాత్కాలికంగా నిషేధాన్ని విధించింది.
జి జిన్పింగ్..
చైనా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత, అధ్యక్షుడు జి జిన్పింగ్ ఖండించినప్పటికీ యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి మాత్రం తైవాన్ లో తన పర్యటనను పూర్తి చేశారు. పెలోసి పర్యటన వన్ చైనా పాలసీని, మూడు చైనా-యుఎస్ సంయుక్త ప్రకటనల నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిందని చైనా ప్రభుత్వం ఆరోపించింది.
నాన్సీ పెలోసి..
పెలోసి తైవాన్ రాజధాని తైపీలో అడుగుపెట్టిన తర్వాత.. తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వడానికి అమెరికా నిబద్ధతను ఆమె పునరుద్ఘాటించారు. ద్వీప దేశం తైవాన్ పట్ల అమెరికా దీర్ఘకాల విధానానికి ఈ పర్యటన ఏ విధంగానూ విరుద్ధంగా లేదని నాన్సీ పెలోసి అన్నారు.
తైవాన్ పరిస్థితి..
తైవాన్ 1949లో అంతర్యుద్ధం తరువాత చైనా నుంచి విడిపోయింది. అంటే తైవాన్ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నప్పటికీ, చైనా దానిని తన సొంత దేశమని పేర్కొంటూనే ఉంది. ఇందుకు తైవాన్ తమది స్వతంత్ర దేశమని వాదింస్తుండగా.. అమెరికా తైవాన్కు మద్దతుగా నిలుస్తోంది.