Tech Layoffs: బాంబు పేల్చిన దిగ్గజ కంపెనీ.. క్లౌడ్ వ్యాపారంలో ఉద్యోగుల కోత..
Tech Layoffs: చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ సైతం తాజాగా ఉద్యోగుల కోతలకు ఉపక్రమించింది. ఆన్లైన్ కంప్యూటింగ్ అండ్ స్టోరేజ్ సేవలను అందించే క్లౌడ్ డివిజన్ లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది.
అలీబాబా గ్రూప్ తీసుకున్న లేఆఫ్ నిర్ణయం వల్ల క్లౌడ్ యూనిట్లో పనిచేస్తున్న దాదాపు 7 శాతం మంది ఉద్యోగులు ప్రభావితం అవుతారని తెలుస్తోంది. త్వరలో ఐపీవోకు వెళుతున్న సంస్థ తన కార్యకలాపాలను క్రమబద్దీకరించినందున ఈ నిర్ణయం వచ్చిందని తెలుస్తోంది. కంపెనీ బాధిత ఉద్యోగులకు కంపెన్సేషన్ ప్యాకేజీని అందించటం ప్రారంభించింది.
చైనీస్ టెక్ దిగ్గజం ఇటీవల కైనియావో అనే దాని లాజిస్టిక్స్ విభాగంతో సహా.. నాలుగు వ్యాపార యూనిట్ల కోసం లిస్టింగ్, నిధులను సేకరించే ప్రణాళికలను వెల్లడించింది. ఈ ప్రణాళికల్లో భాగంగా చైనాకు చెందిన అతిపెద్ద క్లౌడ్ సేవల కంపెనీ వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకి వెళ్లనుందని తెలుస్తోంది. చైనా సాంకేతికత రంగంపై రెండేళ్ల పాడు కొనసాగిన రెగ్యులేటరీ అణచివేతల తర్వాత కంపెనీని మెుత్తం ఆరు ముక్కలుగా విభజించాలని అలీబాబా గ్రూప్ నిర్ణయించింది.
ఇటీవలి త్రైమాసికంలో అలీబాబా క్లౌడ్ విభాగం 2.69 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నివేదించింది. గత ఏడాది ఇదే సమయంలో పోల్చితే ఇది దాదాపు 2 శాతం తక్కువని తెలుస్తోంది. టెక్ కంపెనీలు గత ఏడాది చివర్లో ఉద్యోగులను తొలగించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే 2023లోనూ అదే దోరణిని కంపెనీలు కొనసాగిస్తున్నాయి. అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.