కరోనా ఎఫెక్ట్: నాటు కోడికి యమా డిమాండ్... కిలో రూ 500!
చైనా లో పుట్టిన మాయదారి మహమ్మారి కరోనా వైరస్ ను జయించేందుకు ఉన్న అన్ని మార్గాలను ప్రజలు పాటిస్తున్నారు. ఇప్పటి వరకు దీనికి సరైన చికిత్స లేకపోవటంతో ఏదో ఉన్నంతలోనే ట్రీట్మెంట్ జరుగుతోంది. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ లో తొలుత కరోనా ప్రభావం అంతగా లేనప్పటికీ... కేంద్ర ప్రభుత్వం అవలంభించిన పలు విధానాలతో వైరస్ దేశవ్యాప్తంగా విస్తరించింది. హడావిడిగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
లాక్ డౌన్ ఎత్తివేయగానే ఒక్కసారిగా మహమ్మారి దేశాన్ని కుదిపేసింది. మహా నగరాల నుంచి చిన్న పట్టణాలకు విస్తరించింది. సిటీల్లో ఉంటే వైరస్ బారిన పడుతామన్న భయాలతో ప్రజలు పల్లెటూళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారుతోంది. ఇప్పటి వరకు ప్రశాంతం గా ఉన్న పల్లెటూళ్ళు ఇకపై వైరస్ తో పోరాడాల్సి వస్తుందేమో అన్న భయాలు నెలకొన్నాయి.
అయితే, పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు మాత్రమే కాదు... మన జీవన విధానానికి అవి ఆదర్శప్రాయ ప్రాంతాలని మరోసారి రుజువు అవుతోంది. ఎందుకంటే అక్కడి ప్రజల ఆహార వ్యవహారాలు దానిని స్పష్టం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఆ సంక్షోభం గుర్తుందిగా..: లోన్ మారటోరియంపై రఘురాం రాజన్ హెచ్చరిక
నాటు కోడితో కరోనా అవుట్...
పట్టణాల్లో దొరికే బ్రాయిలర్ కోడి మాంసం (చికెన్) కంటే పల్లెటూళ్ళ లో లభించే నాటు కోడి లో పోషకాలు ఎక్కువని ప్రజలు విశ్వసిస్తున్నారు. రుచితో పాటు అందులో ప్రోటీన్ అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతం ప్రజలు నాటు కోడి మాంసం తినేందుకు ఎగబడుతున్నారు. గ్రామాల్లో ఉన్నవాళ్లకు ఎలాగూ అవి లభిస్తాయి కాబట్టి ప్రాబ్లెమ్ లేదు. కానీ నగరాలూ, పట్టణాల్లో కూడా నాటు కోడి మాంసం తినేందుకు ఆసక్తి చూపుతున్నారు.
దీంతో ఒక్కసారిగా నాటుకోడి కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి చికెన్ సెంటర్ లోనూ ఇప్పుడు నాటు కోడి మాంసం విక్రయిస్తున్నారు. వినియోగదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో పాటు సప్లై తక్కువగా ఉండటంతో ధర విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో నాటు కోడి కూర రూ 500 పలుకుతోంది. ఈ ధరకు సాధారణ చికెన్ రెండు కిలోల కంటే ఎక్కువ లభించటం గమనార్హం.
కడకనాథ్ కూడా...
కరోనా వైరస్ సోకితే పుష్టిగా ఆహారం తీసుకుని, ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవటం మాత్రమే సరైన విధానం అని డాక్టర్లు సూచిస్తున్నారు. శరీరంలో వైరస్ తో పోరాడేందుకు తగిన శక్తిని కూడగట్టుకోవటమే మనముందున్న మార్గం. అందుకే వైరస్ సోకిన వారితో పాటు ముందు జాగ్రత్తలో భాగంగా మిగితా ప్రజలు కూడా పౌష్టికాహారం పై దృష్టిసారిస్తున్నారు.
దీంతో చికెన్ కు అందులోనూ నాటు కోడి సహా సరికొత్త చికెన్ కు డిమాండ్ పెరుగుతోంది. మధ్య ప్రదేశ్ లో లభించే మేలు జాతి కోడి (కడకనాథ్) చికెన్ కు కూడా డిమాండ్ ఊపందుకొంది. పూర్తి నల్లగా ఉండే ఈ కోడి మాంసం కూడా కాస్త నల్లగానే ఉంటుంది. కానీ ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయని ప్రజల విశ్వాసం. అందుకే దీనికి ధర మరింత అధికంగా పెరిగిపోయింది. ప్రస్తుతం కిలో రూ 800 వరకు పలుకుతుండటం విశేషం.
ప్రత్యేక ఫారాలు...
గతంలోనూ సిటీల్లో నాటు కోడికి డిమాండ్ ఉండేది. కానీ కొంత వరకే. కాబట్టి అప్పుడు గ్రామాల నుంచి తెచ్చిన కోళ్లతో సరిపోయేది. కానీ ఇప్పుడు డిమాండ్ పలు రెట్లు పెరగటంతో ప్రత్యేకంగా నాటు కోళ్ల ఫారాలను నడుపుతున్నారు. అలాగే అరుదైన మేలు జాతి కడకనాథ్ కోళ్ల ఫారాలు కూడా వెలిశాయని పౌల్ట్రీ రంగ వర్గాలు వెల్లడించాయి.
ఒక వైపు సాధారణ బ్రాయిలర్ కోళ్ల ఫారాలకు అనుబంధంగా మరో వైపు నాటు కోడి, కడకనాథ్ కోళ్ల ఫారాలతో పౌల్ట్రీ రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఇంటి భోజనం, పండ్లు, తాజా కూరగాయలు, చికెన్, మటన్, డ్రై ఫ్రూప్ట్స్ తీసుకోవటం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే ప్రజలు అందుబాటులో ఉన్న అన్ని రకాల మార్గాలను అన్వేషించి ఇలా నాటు కోడి పై మనసు పారేసుకుంటున్నారు. ధర మాట ఎలా ఉన్నా ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి చూపుతున్న ఆసక్తి కి జై కొట్టాల్సిందే.