లక్షల చికెన్ బిర్యానీ, లావా కేక్స్: లాక్డౌన్లో ఎక్కువగా ఆర్డర్ చేసినవి ఇవే..
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ విధించింది. జూన్ నెల నుండి అన్-లాక్ ప్రారంభమైంది. లాక్ డౌన్ సమయంలో పోలీసులు ప్రజలను బయటకు రానీయలేదు. అత్యవసర అవసరాలకు మించి మిగతా సమయాల్లో.. మిగతా అవసరాలకు బయటకు వచ్చే వెసులుబాటు లేదు. ఆ సమయంలో రెస్టారెంట్లు, బేకరీలు సహా అన్ని వ్యాపారాలు మూతబడ్డాయి. అలాంటి లాక్ డౌన్ సమయంలోను ఆన్లైన్ ద్వారా చాలామంది పెద్ద ఎత్తున బిర్యానీలు, కేక్స్ ఆర్డర్ చేసినట్లు ఓ సర్వేలో వెల్లడైంది.
టాప్ 4 ఐటీ కంపెనీల్లో తగ్గిన హెడ్ కౌంట్.. ఎందుకు, భవిష్యత్తేమిటి?
5.5 లక్షల చికెన్ బిర్యానీలు, 1.2 లక్షల కేక్స్
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలంతా ఇంటి ఫుడ్కే ప్రిఫర్ చేశారు. వైరస్ భయంతో ఇంట్లోనే భిన్నమైన వంటలు ప్రయత్నించారు. అదే సమయంలో ఆన్ లైన్ ఆర్డర్స్ కూడా వచ్చినట్లు శుక్రవారం స్విగ్గీ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5.5 లక్షల చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేశారట. 1.2 లక్షల కేక్స్ ఆర్డర్ చేశారు. అలాగే తమ కిరాణా ప్లాట్ఫాం ద్వారా 323 మిలియన్ల కిలోల ఉల్లి, 56 మిలియన్ కిలోల అరటిపళ్లు ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది.
బర్త్ డే కేక్స్.. భోజనం
బిర్యానీ, చికెన్ బిర్యానీలతో పాటు 1,29,000 చాకో లావా కేక్స్ ఆర్డర్ చేశారు. ఆ తర్వాత గులాబ్ జామూన్, బటర్స్క్రాచ్ మౌస్సే కేక్స్ ఆర్డర్ చేశారు. ప్రతిరోజు రాత్రికి 65,000 భోజనం ఆర్డర్స్ వచ్చినట్లు వెల్లడించింది. 1,20,000 బర్త్ డే కేక్స్ కూడా లాక్ డౌన్ సమయంలో డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. 3,50,000 ప్యాకెట్ల ఇన్స్టాంట్ నూడుల్స్ ఆర్డర్ చేశారు నెటిజన్లు.
మాస్కులు, శానిటైజర్లు..
లాక్ డౌన్ సమయంలో పెద్ద ఎత్తున మాస్కులు, శానిటైజర్లు కూడా డెలివరీ చేసింది స్విగ్గీ. 73,000 బాటిల్స్ శానిటైజర్లు, 47,000 ఫేస్ మాస్కులు ఆర్డర్ చేశారు. స్కూల్ బుక్స్ కూడా డెలివరీ చేసింది. ఈ సమయంలో స్విగ్గీ ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశ్యంతో తమవంతుగా సాయం కూడా చేసింది. అవసరమైన వారికి భోజనం పెట్టేందుకు రూ.10 కోట్లు సమీకరించింది. దీంతో 30 లక్షల భోజనాలు పెట్టింది.