Srilanka crisis: ప్రజలకు లంకంత కష్టం.. కిలో చికెన్ రూ.1,200, ఒక్కో గుడ్డు రూ.62.. ఎందుకంటే..
Srilanka crisis: శ్రీలంక సంక్షోణానికి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు అక్కడి ధరలను చూస్తే జనం ఎలా బతకగలరని అనుమానం రాక తప్పదు. దీనికి తోడు ఈ మధ్య కాలంలో కరెంట్ బిల్లులు భారీగా పెరగటంతో రానున్న కాలంలో మిగిలిన నిత్యావసరాల ధరలు సైతం పెరుగుతాయని తెలుస్తోంది.
చికెన్ రేటు ఇంతా..!
మనకు తెలిసినంత వరకు గుడ్డు ధర రూ.5 లేకుంటే రూ.7 వరకు ఉంటుందని మనకు తెలుసు. అదే విధంగా కిలో చికెన్ మహా అయితే రూ.100 నుంచి రూ.300 వరకు ఉంటుందని మనందరికీ తెలిసిందే. కానీ శ్రీలంకలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక కేజీ చికెన్ ధర రూ.1,200 ఉండగా.. ఒక్కో కోడిగుడ్డు ధర రూ.62కి చేరుకుంది. అవును వినటానికి ఇది షాకింగ్ గా ఉన్నా ఈ విషయాలు నమ్మలేకున్నా అవి అక్షరాలా నిజం. అదనపు డిమాండ్ కారణంగా చికెన్, గుడ్ల ధరలు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది.
ఇంకా ధరలు పెరిగే అవకాశం..
పశుగ్రాసం కొరత కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉందని ఆల్ ఐలాండ్ పౌల్ట్రీ అసోసియేషన్ తెలిపింది. కోడి గుడ్డు ధర రూ.62కి, కిలో ఫ్రోజన్ చికెన్ ధర రూ.1,200కి, మార్కెట్లో లైవ్ చికెన్ ధర కూడా రూ.200కి చేరిందని ఆల్ ఐలాండ్ పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
గతంలో నిషేధాల కారణంగా..
పశుగ్రాసం కొరత కారణంగా కోళ్ల పరిశ్రమ, పొలాలు, ప్రధానంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో జంతువులను పెంచడం కష్టంగా మారింది. శ్రీలంకలో 2021లో ఎరువుల వినియోగంపై నిషేధం వరి సాగులో దాదాపు 40 శాతం తగ్గుదలకు దారితీసింది. దేశంలో ఆహార కొరత ఏర్పడటం ప్రస్తుతం ఇతర సంబంధిత పరిశ్రమలను ప్రభావితం చేసింది. శ్రీలంకలో పౌల్ట్రీ పరిశ్రమకు సుమారు 6,00,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న అవసరం. కానీ ప్రస్తుతం కేవలం 4,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయబడుతుండగా, మిగిలిన వాటిని శ్రీలంక దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి వరకు కిలో మొక్కజొన్న రూ.70 ఉండగా.. కొరత కారణంగా ప్రస్తుతం రూ.275కి చేరింది.
చాలామంది దూరం..
మార్కెట్లో స్థిరత్వం లేకపోవడం, పశుపోషణ ఖర్చులు పెరగడంతో చాలా మంది ఈ రంగానికి దూరమయ్యారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో ఉత్పత్తి 50 శాతం తగ్గింది. ప్రస్తుతం లంకలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపించనందున భవిష్యత్తులో డిమాండ్కు తగ్గట్టుగా కోడి, కోడి గుడ్లను అందించడం సాధ్యం కాదని ఆల్ ఐలాండ్ పౌల్ట్రీ అసోసియేషన్ తెలిపింది.
గడచిన రెండు వారాల్లో..
శ్రీలంకలో వంటగ్యాస్, ఇంధన సమస్యలు కొంత అదుపులో ఉన్నందున గత రెండు వారాల్లో రెస్టారెంట్లు, హోటల్ పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని ఆల్ ఐలాండ్ పౌల్ట్రీ అసోసియేషన్ హెడ్ అజిత్ గుణశేఖర వెల్లడించారు. రానున్న రోజుల్లో శ్రీలంకకు పర్యాటకుల రాక పెరుగుతుందని భావిస్తున్న నేపథ్యంలో చికెన్, గుడ్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని అజిత్ గుణశేఖర అన్నారు.