YES bank crisis: యస్ బ్యాంకు నుండి కమీషన్లు.. చంద్రబాబు పేరు లాగిన విజయసాయి
యస్ బ్యాంకు సంక్షోభం కస్టమర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించింది. కస్టమర్ల విత్ డ్రా పరిమితిని రూ.50,000కు తగ్గించింది. నెట్ బ్యాంకులు సరిగ్గా పని చేయడం లేదు. ఏటీఎం వద్ద క్యూ కట్టినా డబ్బులు తీసుకోలేని పరిస్థితి. చెక్ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. డెబిట్ కార్డుల ద్వారా డబ్బులు తీసుకోవచ్చని శనివారం అర్ధరాత్రి ట్వీట్ చేసింది యస్ బ్యాంకు. ఓ వైపు యస్ బ్యాంకు సంక్షోభం కస్టమర్లను ఇబ్బందులకు గురి చేస్తుండగా ఈ సంక్షోభంపై నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
యస్ బ్యాంకు సంక్షోభం, మరిన్ని వార్తలు
కేంద్రం ఒత్తిడి వల్లే..
యస్ బ్యాంకును సంక్షోభంనుండి బయటపడేసేందుకు ఎస్బీఐ చేస్తోన్న సాయం కేంద్రం ఒత్తిడి వల్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఆరోపించారు. యస్ బ్యాంకులో సుమారు రూ.2400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. దీనిపై చిద్దూ మాట్లాడారు.
స్వచ్చంధంగా రాలేదని అనుమానాలు
యస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టేందుకు ఎస్బీఐ స్వచ్చంధంగా వచ్చినట్లు కనిపించడం లేదని చిదంబరం అన్నారు. దీని వెనుక ప్రభుత్వ తీవ్ర ఒత్తిడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఐడీబీఐ బ్యాంకు కష్టాల్లో ఉన్నప్పుడు ఎల్ఐసీ సంస్థ ఆదుకున్న మాదిరిగా ఈ పరిణామం ఉందన్నారు. అధికార పార్టీ అవలంభిస్తున్న ఆర్థిక విధానాలే సంక్షోభాలకు కారణమన్నారు.
చంద్రబాబుపై విజయ సాయి రెడ్డి
యస్ బ్యాంకు సంక్షోభంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఈ అంశంపై స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. 'చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేశాడు. రూ.1,300 కోట్ల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. యస్ బ్యాంకుకు ఏపీ టూరిజం శాఖ నిధులను కూడా దోచిపెట్టాడు. ఇంకెన్ని ఉన్నాయో?' అని దుయ్యబట్టారు.
|
స్క్రీన్ షాట్ పోస్ట్
అంతేకాదు, ఈ ట్వీట్ చేస్తూ ఓ స్క్రీన్ షాట్ కూడా అటాచ్ చేశాడు. యస్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జతకట్టి టూరిజం మిషన్ డాక్యుమెంట్ను లాంచ్ చేసిన స్క్రీన్ షాట్ పోస్ట్ చేశారు.
విజయసాయి అనుమానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యస్ బ్యాంక్ 2015లో టూరిజంపై అగ్రిమెంట్ చేసుకుంది. ఈ రెండు కాకుండా ఇంకా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారోనని అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎక్కడైనా చంద్రబాబు పేరు
ఆదివారం కూడా విజయ సాయి రెడ్డి యస్ బ్యాంకు అంశానికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. 'Yes Bank పైన చంద్రబాబు అంత ప్రేమ కనబర్చారంటేనే అవతవకలు జరిగినట్టు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ పై ఈడి కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ పై దర్యాప్తు జరుగుతోంది. దేశంలో ఎక్కడ హవాలా, లాండరింగ్ బయటపడ్డా బాబు పేరు వినిపిస్తోంది' అని పేర్కొన్నారు.
టీడీపీ ఏం చెప్పిందంటే..
యస్ బ్యాంకు నుండి కమిషన్ తీసుకొని రూ.1300 కోట్ల టీటీడీ నిధులను డిపాజిట్ చేయించారనే ఆరోపణలపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. డిపాజిట్లపై కేవలం టీటీడీ బోర్డు మాత్రమే నిర్ణయం తీసుకుందని, విజయసాయి చేసిన ఆరోపణలు అర్థం లేనివన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీటీడీ ఆస్తుల గురించి ఎన్నో ఆరోపణలు చేసిందని, కానీ ఇప్పుడు అధికారంలో ఉండి వేటిని కూడా నిరూపించలేకపోతోందన్నారు.