ఐసీఐసీఐ బ్యాంకు నిర్ణయంపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన చందా కొచ్చర్
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచర్ న్యాయపోరాటానికి దిగారు. తనను బ్యాంక్ సీఈవో పదవి నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటుగా 2009 నుంచి 2019 వరకు పొందిన బోనస్లను తిరిగి ఇచ్చేయాలన్న ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు నిర్ణయంపై ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చందాకొచ్చర్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ రంజిత్, జస్టిస్ కార్నిక్లతో కూడిన దర్మాసనం వాదనలు విననుంది. చందాకొచ్చర్ తరపున న్యాయవాదులు విక్రమ్ నన్కాని, సుజయ్ కంతవాలా వాదనలు వినిపిస్తుండగా.. ఐసీసీఐ బ్యాంక్ తరపున డారియస్ కమ్బాటా వాదనలు వినిపించనున్నారు. హేతుబద్దమైన ఆధారాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అనుమతి లేకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించడంపైనే చందా కొచ్చర్ పిటిషన్లోని ముఖ్య అంశమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
వీడియోకాన్ గ్రూప్కు రుణాల మంజూరు విషయంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా ఉన్న చందాకొచ్చర్ క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారన్న ఆరోపణలు గత ఏడాది దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ.. చందా కొచ్చర్తోపాటు ఆమె, భర్త దీపక్ కొచ్చర్, ఇతర బంధువులపై కూడా చార్జ్ షీటు దాఖలు చేశాయి.
అయితే ప్రారంభంలో చందా కొచ్చర్ను ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు వెనకేసుకొచ్చింది. తాత్కాలికంగా సీఈవో పదవి నుంచి ఆమెను తప్పించింది. అయితే ఆమెపై వచ్చిన ఆరోపణలపై విచారణకు జూన్ 6న నియమించిన మాజీ న్యాయమూర్తి బీఎన్ కృష్ణ ఆధ్వర్యంలోని స్వతంత్ర దర్యాప్తు కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం ఆమెపై వేటు వేసింది.
సీఈవో పదవి నుంచి చందా కొచ్చర్ను తొలగిస్తున్నట్లు ప్రకటించడమేకాక ఏప్రిల్ 2009 నుంచి మార్చి 2018 వరకు ఆమెకు చెల్లించిన బోనస్ మొత్తాలను, స్టాక్లను వాపస్ చేయాలని కూడా ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్పై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై డిసెంబర్ 2వ తేదీన బాంబే హైకోర్టు ధర్మాసనం వాదనలు విననుంది.