ప్రమోటర్గానూ గౌతమ్ థాపర్ తొలగింపు.. సీజీ పవర్ నిర్ణయం
కంపెనీలో అక్రమాల నేపథ్యంలో ఇప్పటికే ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన గౌతమ్ థాపర్ను.. ప్రమోటర్గానూ తొలగించాలని సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ తాజాగా నిర్ణయించింది. కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్షిక నివేదికలో కంపెనీ కొత్త ఛైర్మన్ ఆశిష్ కుమార్ గుహ వెల్లడించారు.
అంతేకాదు, గౌతమ్ థాపర్కు చెందిన అవంతా హోల్డింగ్స్ లిమిటెడ్(ప్రమోటర్)ను పబ్లిక్ షేర్ హోల్డర్గా మార్చమని కోరుతూ గత నెలలోనే సెబీకి దరఖాస్తు చేశామని, ప్రస్తుతం ఇది సెబీ పరిశీలనలో ఉందని ఛైర్మన్ ఆశిష్ కుమార్ గుహ ఈ వార్షిక నివేదికలో షేర్ హోల్డర్లకు వివరించారు.
అక్రమాలు, నిధుల మళ్లింపు నేపథ్యంలో...
అనేక అవకతవకలకు పాల్పడడం, బోర్డు అనుమతి లేకుండానే విచ్చలవిడిగా నిధులు మళ్లించడం వంటి ఆరోపణలతో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గౌతమ్ థాపర్ను ఈ ఏడాది ఆగస్టు 29న ఆ పదవి నుంచి కంపెనీ బోర్డు తొలగించింది. రూ.3 వేల కోట్ల ఈ స్కామ్లో గౌతమ్ థాపర్కు చెందిన అవంత హోల్డింగ్స్ లిమిటెడ్(ఏహెచ్ఎల్) లబ్ధి పొందింది. యస్ బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లింపునకు సంబంధించి ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కు ఒకటి బౌన్స్ అవడంతో తీగ లాగితే డొంక కదిలిన చందాన సీజీ పవర్లో అవకతవకలు బయటికి వచ్చాయి.
కొత్త ఛైర్మన్ సారథ్యంలో...
అనంతరం కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్న ఆశిష్ కుమార్ గుహ సీజీ పవర్ కొత్త ఛైర్మన్గా నియమితులయ్యారు. ఇటీవల విడుదల చేసిన కంపెనీ వార్షిక నివేదికలో అక్రమాల అనంతరం సాగుతున్న దర్యాప్తు, తీసుకున్న చర్యల గురించి ఆయన వివరించారు. కంపెనీలో జరిగిన అక్రమాలపై సాగుతున్న దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని, దర్యాప్తు తొలిదశ నివేదిక కూడా అందిందని, భారీ మోసాల ప్రభావం కంపెనీపై తీవ్రంగానే పడిందని, మరో స్వతంత్ర లా సంస్థ కూడా ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగిస్తోందని, దీంతో దోషులెవరో తేలుతుందని, ఆ తరువాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వార్షిక నివేదికలో వివరించారు.
పడిపోయిన ప్రమోటర్ల వాటా...
గౌతమ్ థాపర్ నేతృత్వంలోని ప్రమోటర్ గ్రూప్కు 2018 ఏప్రిల్ 1 నాటికి సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కంపెనీలో 21.54 కోట్ల షేర్లు ఉన్నాయి. అంటే వారి వాటా 34.38 శాతం అన్నమాట. అయితే ఈ షేర్లు అన్నింటినీ ప్రమోటర్లు తనఖా పెట్టారు. అవకతవకలు బయటపడిన తరువాత రుణ సంస్థలు జాగ్రత్త పడ్డాయి. కేకేఆర్ ఇండియా డెట్ ఆపర్చునిటీస్ ఫండ్, కేకేఆర్ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి సంస్థలు ఈ ఏడాది మార్చి 8న అవంతా హోల్డింగ్స్కు చెందిన తనఖా షేర్లు 10.8 శాతంలో.. 6.76 శాతం షేర్లను తీసేసుకున్నాయి. ఆ తరువాత ఎల్ అండ్ టీ ఫైనాన్స్, యస్ బ్యాంక్లు కూడా ఇలాగే చేశాయి. దీంతో కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్ల వాటా 8,574 షేర్లకు పడిపోయింది.
తెగదెంపులే మేలని భావిస్తూ...
కంపెనీలో అక్రమాలు తొలిదశ దర్యాప్తులో తేలిన నేపథ్యంలో గౌతమ్ థాపర్, ఇతర ప్రమోటర్ల తో సంబంధాలను తెగదెంపులు చేసుకోవడమే మేలనే నిర్ణయానికి సీజీ పవర్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రమోటర్ పదవి నుంచి కూడా గౌతమ్ థాపర్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా థాపర్కు చెందిన అవంతా హోల్డింగ్స్ లిమిటెడ్(ప్రమోటర్)ను పబ్లిక్ షేర్ హోల్డర్గా మార్చమని కోరుతూ గత నెల 18న సెబీని ఆశ్రయించినట్లు ప్రస్తుత ఛైర్మన్ గుహ వార్షిక నివేదకలో వెల్లడించారు. ప్రస్తుతం ఇది సెబీ పరిశీలనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.