గుడ్న్యూస్: ఆర్థిక వ్యవస్థ గాడినపడుతోంది.. 115 కంపెనీల సీఈవోలు ఏం చెప్పారంటే?
భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, వ్యాపారాలు మెరుగుపడుతున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(CII) సర్వే వెల్లడించింది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ డీలాపడిన విషయం తెలిసిందే. అయితే జూన్ నుండి వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నట్లు వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. దేశీయ కార్పోరేట్ రంగానికి చెందిన 115 ప్రముఖ కంపెనీల సీఈవోలతో CII నిర్వహించిన పోల్ సర్వేలో కూడా ఈ విషయం వెల్లడైంది. లాక్ డౌన్ సడలించడంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, కంపెనీలు తమ వ్యాపారాలు ప్రారంభించాయని, ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని సీఈవోలు అభిప్రాయపడ్డారు.
కోలుకుంటున్నాం.. జీవితం.. జీవనోపాధి
లోహాలు, మైనింగ్, తయారీ, ఆటో, పార్మా, హెల్త్, ఇంధనం, మౌలిక సదుపాయాలు, నిర్మాణంతో పాటు సేవా రంగాలు ITES, హెల్త్ హాస్పిటాలిటీ టూరిజం, ఈ-కామర్స్ రంగాలకు చెందిన ప్రతినిధులు ఈ పోల్లో పాల్గొన్నారు. ఈ మేరకు CII ఆదివారం వెల్లడించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలించినందున కార్పోరేట్ ఇండియా వ్యాపారం, ఆర్థిక కార్యకలాపాలను పునఃప్రారంభమయ్యాయని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సామర్థ్య వినియోగం 50 శాతం కంటే పైకి చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవితంతో పాటు జీవనోపాదిపై దృష్టి సారించాలని సీఈవోలు అభిప్రాయపడ్డారు.
పట్టణాలు, గ్రామాల్లో కరోనా ముందుస్థాయికి
మెట్రో నగరాల్లో డిమాండ్ ఇప్పటికీ అంతంత మాత్రమేనని, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వస్తు సేవల డిమాండ్ ఇప్పటికే కరోనా ముందుస్థాయికి చేరినట్లు సీఈవోలు తెలిపారు. ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్, వినియోగ వస్తువులు, నిర్మాణ సామాగ్రి ఉత్పత్తి కంపెనీల డిమాండ్ ఇప్పటికే గాడినపడిందన్నారు. పరిస్థితులు కుదుటపడుతున్నాయని, కాబట్టి కంపెనీల ఉత్పత్తి సామర్ధ్య వినియోగం పెరిగే అవకాశం ఉందన్నారు. పండగల సీజన్ కారణంగా డిమాండ్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తెరుచుకోవడానికి అనుమతించడం చాలా ముఖ్యమని, సామర్థ్య వినియోగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.
బిజినెస్ సెంటిమెంట్
కేంద్రం, ఆర్బీఐ ప్రకటించిన సంస్కరణ, పునరుజ్జీవన చర్యలతో పాటు ఆర్థిక కార్యకలాపాలను అన్లాక్ చేయడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో బిజినెస్ సెంటిమెంట్ను క్రమంగా మెరుగుపరచడానికి దోహదపడిందన్నారు. ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తే తప్ప డిమాండ్ మళ్లీ పుంజుకునే అవకాశం లేదన్నారు. డిమాండ్ పుంజుకున్నప్పుడే కంపెనీల ఉత్పత్తి సామర్థ్య వినియోగం పెరుగుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీల ఆదాయాలు గత ఏడాదిస్థాయిలో ఉండవని ఎక్కువ మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు.
సీఈవోలు ఆశాజనకంగా..
వినియోగదారుల వినియోగ డిమాండ్పై 32 శాతం మంది సీఈవోలు మంచి అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. 27 శాతం మంది సీఈవోలు గత ఏడాది ద్వితీయార్థంతో పోలిస్తే ఎలాంటి మార్పు ఉండదని అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్థ సంవత్సరంతో పోలిస్తే రెండో అర్థ సంవత్సరం సానుకూలంగా ఉంటుందని 31 శాతం మంది తెలిపారు. ఎగుమతులపై 40 శాతం మంది సీఈవోలు ఆశాజనకంగా ఉందన్నారు. వ్యవసాయంతో పాటు ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిర్మాణ సామాగ్రి వంటి రంగాల్లో సానుకూల రికవరీ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మూడో క్వార్టర్ నాటికి డిమాండ్ మరో 20 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.
వడ్డీ నుండి హోమ్లోన్ వరకు, డిస్కౌంట్స్..: కస్టమర్లకు ICICI బ్యాంకు బంపరాఫర్స్