CEO's On Recession: ముందుంది ముసళ్ల పండగంటున్న సీఈవోలు.. మాంద్యంపై వారి మాట ఇదే..!
CEO's On Recession: కేపీఎంజీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 1300లకు పైగా కంపెనీల సీఈవోలతో ఆర్థిక మాంద్యంపై సర్వే నిర్వహించింది. ఇందులో షాకింగ్ విషయాలను వారు వెల్లడించారు. మెుత్తం సర్వేలో పాల్గున్న సీఈవోలలో 86 శాతం మంది ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే దీని ప్రభావం తక్కువ కాలం లేదా తక్కువ ప్రభావం ఉంటుందని 58 శాతం మంది భావిస్తున్నారు.
వృద్ధిపై మాట..
ఆర్థిక మందగమనం ఇన్నప్పటికీ వచ్చే ఏడాది కాలంలో వృద్ధికి ఢోకా ఉండదని కంపెనీల సీఈవోలు గట్టిగా చెబుతున్నారు. KPMG 2022 CEO ఔట్లుక్ పేరుతో ఈ సర్వేను నిర్వహించారు. దీని వల్ల 10 శాతం వరకు ఆదాయం తగ్గవచ్చని 71 శాతం మంది సీఈవోలు చెబుతున్నారు. ఇదే సమయంలో 71 శాతం మంది నాయకులు రాబోయే మూడేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలపై నమ్మకంగా ఉన్నారు.
ఉద్యోగుల నియామకాలు..
వాహన, బ్యాంకింగ్, రిటైల్, ఇంధనం, మౌలిక వసతులు, ఇన్సూరెనస్, హెల్త్ కేర్, తయారీ, సాంకేతికత, టెలికాం వంటి రంగాలకు చెందిన ప్రపంచ సీఈవోలు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకుని నియామకాలను నిలిపివేసినట్లు 39 శాతం మంది వెల్లడించారు. పైగా రానున్న కాలంలో తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నట్లు అత్యధికంగా 46 శాతం మంది చెప్పటం ఆందోళన కలిగిస్తోంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో..
మాంద్యం అనే మాట తమను ఆందోళనకు గురిచేస్తోందని 14 శాతం మంది వెల్లడించారు. ఇలాంటి సందర్భంలో అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సరైనది కాదని అంటున్నాయి. సర్వే ప్రకారం 65 శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు వస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మరో 28 శాతం మంది హైబ్రిడ్ విధానాన్ని కోరుకోగా.. కేవలం 7 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోం వైపు మెుగ్గుచూపారు.
టాటా స్టీల్ సీఈవో..
మాంద్యంపై మాట్లాడిన టాటా స్టీల్ సీఈవో టివి నరేంద్రన్ తనకు మహమ్మారితో పాటు యూరప్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఎక్కువగా ఆందోళ కలిగిస్తున్నాయని అన్నారు. జియో పొలిటికల్ విషయాలను ప్రథమ రిస్క్ గా తాను భావిస్తున్నానన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం అవలంభిస్తున్న వ్యాపార విధానాలను మార్చుకోవటంతో పాటు గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నిర్మించుకోవాలని సూచించారు.