తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి: ఏపీకి భారీగా గ్రాంట్: 19 రాష్ట్రాలకు నిధులు
న్యూఢిల్లీ: నిర్మల సీతారామన్ సారథ్యంలోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి నిధులను మంజూరు చేసింది. దీని విలువ 8,453.92 కోట్ల రూపాయలు. స్థానిక సంస్థల పరిధిలో వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి, ఆసుపత్రులకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఈ మొత్తాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిధులన్నీ గ్రాంట్గా విడుదల అయ్యాయి. మొత్తం 19 రాష్ట్రాల స్థానిక సంస్థలకు ఈ నిధులు మంజూరు అయ్యాయి.
Latent View Analytics IPO: మరో బ్లాక్ బస్టర్ డెబ్యూ రెడీ: గ్రే మార్కెట్ కింగ్
ఏపీ వాటాగా..
ఇందులో ఏపీ వాటా కింద 488.15 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వైద్య, ఆరోగ్య రంగానికి ఈ నిధులతో మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరమ్మతులు చేయడం, అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేయడం, వాటిని అప్గ్రేడ్ చేయడం, రోగులకు కల్పించే సదుపాయాలను మరింత మెరుగుపర్చడం వంటి చర్యల కోసం ఏపీ ప్రభుత్వం ఈ 488.15 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది.
|
తెలంగాణ మిస్..
స్థానిక సంస్థల్లో ఆరోగ్య రంగానికి నిధులను మంజూరు చేయడానికి ఉద్దేశించిన ఈ 19 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు. తెలంగాణకు నిధులను కేటాయించలేదు కేంద్ర ప్రభుత్వం. దీనికి గల కారణాలేమిటనేది తెలియరాలేదు. ఒక్క తెలంగాణకు మాత్రమే కాకుండా.. మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఈ జాబితాలో చోటు దక్కలేదు. గుజరాత్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, గోవా, హర్యానా, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయాలకు నిధులను విడుదల చేయలేదు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు చోటు కల్పించలేదు.
రాష్ట్రాలవారీగా నిధుల కేటాయింపు ఇలా..
ఏపీకి కేంద్ర ప్రభుత్వం 488.15 కోట్ల రూపాయలను గ్రాంట్గా మంజూరు చేసింది. ఇదే జాబితాలో అరుణాచల్ ప్రదేశ్-రూ.46.94, అస్సాం-272.25, బిహార్-రూ1,116.30, ఛత్తీస్గఢ్-రూ.338.79, హిమాచల్ ప్రదేశ్-రూ.98, జార్ఖండ్-రూ.444.39, కర్ణాటక-రూ.551.53, మధ్య ప్రదేశ్-రూ.922.79, మహారాష్ట్ర-రూ.778, మణిపూర్-42.87, మిజోరం-31.19, ఒడిశా-రూ.461.76, పంజాబ్-రూ.399.65, రాజస్థాన్-రూ.656.17, సిక్కిం-రూ.20.97, తమిళనాడు-రూ.805.92, ఉత్తరాఖండ్-రూ.150.09, పశ్చిమ బెంగాల్-రూ.828.06 కోట్లను ఆర్థిక మంత్రిత్వ విడుదల చేసింది.
ఏపీ లోటును ఈ రకంగా భర్తీ చేసిందా..?
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అదనపు రుణాలను తీసుకోవడానికి అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. సంపదను సృష్టించడంలో విఫలమైన కారణంగా అదనపు రుణ పరిమితికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. నిర్దేశించిన మూలధన వ్యయం లక్ష్యాలను అధిగమించనందు వల్ల అదనంగా రుణాలకు అవకాశం ఇవ్వలేదు. దీనికి లోటు భర్తీగా అన్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా 488 కోట్ల రూపాయల మొత్తాన్ని గ్రాంట్గా విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదనపు రుణ పరపతికి కేంద్రం అనుమతి ఇచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణతో సహా చత్తీస్గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్ ఉన్నాయి.