కోవిడ్ ఆసుపత్రులు, పేషెంట్ల కుటుంబాలకు కేంద్రం బిగ్ రిలీఫ్: ఆ సెక్షన్ మినహాయింపు
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న కల్లోలం అంతా ఇంతా కాదు. కనీవినీ ఎరుగని ఉత్పాతానికి దారి తీసిందీ మహమ్మారి. దేశాన్ని కరోనా సెకెండ్ వేవ్ దారుణంగా దెబ్బ కొడుతోంది. జనం ఉసురు తీస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా మరణాలకు కారణమౌతోంది. వరుసగా మరోసారి కూడా నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. యాక్టివ్ కేసులు 37,23,446గా రికార్డయ్యాయి. ఇంతమందికి ఒకేసారి కరోనా ట్రీట్మెంట్ అందించలేక ఆసుపత్రులు సతమతమౌతున్నాయి. ఆక్సిజన్, పడకల కొరతను ఎదుర్కొంటున్నాయి.
WhatsApp: ఇండియన్సా..మజాకా: దిగొచ్చిన మేనేజ్మెంట్: ఆ డెడ్లైన్ వాయిదా
ఈ పరిస్థితుల మధ్య కోవిడ్ పేషెంట్ల కోసం ట్రీట్మెంట్ చేస్తోన్న ఆసుపత్రుల్లో ఆర్థికపరమైన లావాదేవీలను నిర్వహించడానికి కేంద్రం విధించిన కొన్ని షరతులు, నిబంధనలు అడ్డుగా ఉంటోన్నాయి. రెండు లక్షల వరకు నగదు చెల్లింపులను జరిపే వీలు లేదు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్టీ- దీనికి అంగీకరించదు. ఫలితంగా- ఒకేసారి రెండు లక్షల రూపాయల బిల్లింగులను కోవిడ్ పేషెంట్ల కుటుంబీకులు చెల్లించలేకపోతోన్నారు. ఈ ఇబ్బందులను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్టీ నుంచి కోవిడ్ ట్రీట్మెంట్ ఆసుపత్రులకు మినహాయింపు ఇచ్చింది.
ఇది తాత్కాలికం మాత్రమే. ఈ నెల 31వ తేదీ వరకు ఈ సౌకర్యం అమల్లో ఉంటుంది. కిందటి నెల 1వ తేదీ నుంచి నిర్వహించిన లావాదేవీలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆదాయపు పన్ను విభాగం ఓ ట్వీట్ చేసింది. కోవిడ్ ట్రీట్మెంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. రెండు లక్షల రూపాయలు లేదా అంతకు మించి నగదు లావాదేవీలను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఫలితంగా- నగదు చెల్లింపులను అప్పటికప్పుడు పూర్తి చేసుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడానికి సంపూర్ణ వెసలుబాటును కేంద్ర ప్రభుత్వం కరోనా పేషెంట్ల కుటుంబీకులకు కల్పించినట్టయింది.
కోవిడ్ ఆసుపత్రుల్లో రెండు లక్షల నగదు లావాదేవీల పరిమితిని ఎత్తి వేయాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టులోనూ పిటీషన్లు దాఖలయ్యాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269 ఎస్టీ ప్రకారం ఒక వ్యక్తి నుంచి రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదును తీసుకోవడానికి వీల్లేదని, దీన్ని తొలగించాలంటూ మనీషా గుప్తా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 269 ఎస్టీ కింద రెండు లక్షల రూపాయలు, ఆపై ఎక్కువ నగదును తీసుకోవడానికి ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది విచారణలో ఉండగానే కేంద్రం ఆ పరిమితిని ఎత్తేసింది.