PMJJBY, PMSBY: పేదోళ్ల బీమా పథకాల ప్రీమియం..మరింత ప్రియం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి బీమా సౌకర్యాన్ని కల్పించడానికి అమలు చేస్తోన్న ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) ప్రీమియం మొత్తాలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం వీటిని సవరించింది. పెరిగిన ప్రీమియం మొత్తాన్ని ఇవ్వాళ్టి నుంచి అమలులోకి తీసుకొచ్చింది. ఈ రెండు బీమా పథకాలకు ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల తొలగించడంలో భాగంగాఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది.
పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి ఇదివరకు 330 రూపాయలను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడీ మొత్తం పెరిగింది. ఇకపై ప్రతి సంవత్సరం 436 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు రూ.1.25 పైసలను దీని కింద చెల్లించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద వార్షిక ప్రీమియం మొత్తం 12 నుంచి 20 రూపాయలకు పెరిగింది. జీవన్ జ్యోతి బీమా యోజనలో 32 శాతం, సురక్ష బీమా యోజనలో 67 శాతం మేర సవరించింది కేంద్ర ప్రభుత్వం.
ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు పీఎంజేజేబీవై కింద నమోదైన నమోదైన లబ్దిదారుల సంఖ్య 6.4 కోట్లు. పీఎంఎస్బీవై కింద 22 కోట్ల మంది లబ్దిదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పీఎంఎస్బీవై పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి మార్చి 31వ తేదీ వరకు 1,134 కోట్ల రూపాయలను ప్రీమియం రూపంలో సేకరించింది కేంద్రప్రభుత్వం. క్లెయిమ్స్ మాత్రం దీనికి రెట్టింపు అయ్యాయి. 2,513 కోట్ల రూపాయల మేర క్లెయిమ్స్ అయ్యాయి.
పీఎంజేజేబీవై కింద 9,737 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రీమియం రూపంలో సమీకరించింది. క్లెయిమ్స్ కోసం 14,144 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ప్రమాదంలో మరణించినా లేక పూర్తి వైకల్యం పాలైనా పీఎంఎస్బీవై కింద రెండు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. పాక్షిక వైకల్యం పాలైతే లక్ష రూపాయల పరిహారం అందుతుంది. పీఎంజేజేబీవై కింద పాలసీదారు మరణిస్తే రెండు లక్షల రూపాయల పరిహారం లభిస్తుంది.