ఎట్టకేలకు మోక్షం: జీఎస్టీ బకాయిలు విడుదల: ఏపీ, తెలంగాణ వాటా ఇదే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటూ వస్తోన్న వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) బకాయిల చెల్లింపు వ్యవహారం మొత్తానికి సుఖాంతమైంది. ఈ బకాయిలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ బకాయిలను కొద్దిసేపటి కిందటే మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రాలవారీగా ఎంత మొత్తాన్ని కేటాయించామనే విషయాన్నీ స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
అంచనాల కంటే మరింత దిగజారిన జీడీపీ ద్రవ్యలోటు
21 రాష్ట్రాల బ్రేకప్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 21 రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలను మంజూరు చేసినట్లు ఈ ప్రకటనలో తెలిపింది. దీని మొత్తం 86,912 కోట్ల రూపాయలు. కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిల కోసం ఏపీ, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. ఘర్షణ వైఖరిని ప్రదర్శించింది.
జీఎస్టీ బకాయిల కోసం..
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు- జీఎస్టీ బకాయిల విషయంలో పలుమార్లు బహిరంగంగా కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఏపీ కొంత మెతక వైఖరిని కనపరిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ను కలిసి ఈ విషయంపై విజ్ఞప్తులు చేశారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా పలుమార్లు నిర్మల సీతారామన్తో సమావేశం అయ్యారు.
పార్లమెంట్లో గళం..
బకాయిల చెల్లింపుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అటు పార్లమెంట్లోనూ గళమెత్తిన విషయం తెలిసిందే. వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి మొన్నటి వార్షిక బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు. ఆయా పోరాటాలు, విజ్ఞప్తులు, విన్నపాలు మొత్తానికి ఫలించాయి. ఏపీ తెలంగాణకు చెల్లించాల్సిన జీఎస్టీ అరియర్స్ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మొత్తంగా 21 రాష్ట్రాలకు ఈ జీఎస్టీ బకాయిలను చెల్లించింది.
ఏపీ, తెలంగాణ వాటా ఇదీ..
ఈ ఏడాది ఫ్రిబవరి-మార్చి నెలలకు చెల్లించాల్సిన బకాయిలు 21,322 కోట్ల రూపాయలు. జనవరి 2022 వరకు మంజూరు చేయాల్సిన మొత్తం 47,617 కోట్ల రూపాయలు. ఈ రెండింటినీ కలిపి ఏకమొత్తంలో విడుదల చేసినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ వివరించింది. ఏపీ- రూ. 3,199 కోట్లు, తెలంగాణ- 296 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి.
మహారాష్ట్ర టాప్..
మిగిలిన రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. అస్సాం- రూ.232 కోట్లు, ఛత్తీస్గఢ్-రూ.1,434 కోట్లు, ఢిల్లీ-రూ.8,032 కోట్లు, గోవా-రూ.1,291 కోట్లు, గుజరాత్-రూ.3,364 కోట్లు, హర్యానా-రూ.1,325 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.838 కోట్లు, జార్ఖండ్-రూ.1,385 కోట్లు, కర్ణాటక-రూ.8,633 కోట్లు, కేరళ-రూ.5,693 కోట్లు, మధ్యప్రదేశ్-రూ.3,120 కోట్లు, మహారాష్ట్ర-రూ.14,145 కోట్లు, పుదుచ్చేరి-రూ.576 కోట్లు, పంజాబ్-రూ.5,890 కోట్లు, రాజస్థాన్-రూ.963 కోట్లు, తమిళనాడు-9,602 కోట్లు, తెలంగాణ-రూ.296 కోట్లు, ఉత్తర ప్రదేశ్-8,874 కోట్లు, ఉత్తరాఖండ్-1,449 కోట్లు, పశ్చిమ బెంగాల్-రూ.6,591 కోట్లు మంజూరు అయ్యాయి.