లాక్ డౌన్లో ఉద్యోగం కోల్పోయారా ? నిరుద్యోగ భత్యంగా 50 శాతం జీతం- మూడు నెలలపాటు..
కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ప్రజలందరి పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా వేతన జీవుల ఇబ్బందులు చెప్పాల్సిన పనే లేదు. నెలంతా పనిచేసి జీతం కోసం ఎదురుచూసే వీరికి కార్పోరేట్ సంస్ధలు చాలా సులువుగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు చావు కబురు చల్లగా చెప్పేశాయి. ఇలా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కొన్ని షరతులతో వారు మూడు నెలల జీతం పొందేలా నిబంధనలను సడలించింది. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది కార్మికులకు లబ్ది చేకూరనుంది.
ఆవిరైపోతున్న ఉద్యోగాలు- 9 వారాల గరిష్టానికి నిరుద్యోగిత రేటు..
లాక్ డౌన్తో ఉద్యోగాల కోతలు..
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా కార్పోరేట్ సంస్ధలతో పాటు చిన్నా చితకా సంస్ధల కార్యకలాపాలు కూడా పూర్తిగా మందగించాయి. లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా వారు పూర్తిగా కోలుకోలేదు. సంస్ధల పరిస్ధితి అటుంచి ఉద్యోగులు, కార్మికుల కష్టాలకు లెక్కేలేదు. నెలంతా కష్టపడి జీతం కోసం ఒకటో తేదీన ఎదురు చూస్తున్న లక్షలాది మంది వేతన జీవులకు సంస్ధలు భారీగా షాక్లు ఇచ్చేశాయి. దీంతో లక్షల ఉద్యోగాలు ఆవిరైపోయాయి. వీరంతా ఇప్పుడు స్వస్ధలాలకు చేరుకుని ప్రత్యామ్నాయ ఉపాధి వేటలో బిజీగా ఉంటున్నారు. ఒకప్పుడు లక్షల వేతనాలు తీసుకున్న వారు కూడా ఇప్పుడు రోజు గడవని పరిస్ధితికి చేరిపోతున్నారు. అయితే వీరిలో తక్కువ వేతనాలతో ఉద్యోగాలు చేసి, లాక్ డౌన్లో ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆదుకోవాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న తరుణంలో కేంద్రం స్పందించింది.
నిరుద్యోగ భత్యంగా 50 శాతం జీతం...
లాక్డౌన్లో ఉద్యోగాలు కోల్పోయిన చిరు వేతన జీవులను ఆదుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న చిరు వేతన జీవులకు వారు అప్పటివరకూ పొందీన జీతాల్లో 50 శాతాన్ని మూడు నెలలకు లెక్కేసి చెల్లించేలా కంపెనీలకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం తాజాగా నిబంధనలు సవరించింది. ప్రస్తుతం వీరిని ఓసారి ఉద్యోగాల నుంచి తొలగించిన తర్వాత వారికి ఎలాంటి జీతభత్యాలు చెల్లించేందుకు నిబంధనలు లేవు. కానీ కేంద్రం వాటిని మానవతా దృక్పథంతో సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిరు వేతన జీవులకు లబ్ది చేకూరబోతోంది.
షరతులు వర్తిస్తాయ్..
లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వేతన జీవులకు మూడు నెలల పాటు జీతంలో 50 శాతం నిరుద్యోగ భత్యంగా ఇచ్చేందుకు కేంద్రం కొన్ని షరతులు విధించింది. ఇందులో వీరు తప్పనిసరిగా ఉద్యోగుల బీమా కార్పోరేషన్ ఈఎస్ఐలో 2018 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 మధ్య రెండేళ్ల పాటు సభ్యులుగా ఉండాలి. అలాగే 2019 అక్టోబర్ 31 నుంచి 2020 మార్చి 31 మధ్య కనీసం 78 రోజులు ఈఎస్ఐ చందాదారులుగా ఉన్న వారికే ఇది వర్తిస్తుంది. కరోనా లాక్డౌన్లో ఉద్యోగాలు కోల్పోయిన వారై ఉండాలి. మార్చి 24 నుంచి డిసెంబర్ 31 మధ్య ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ ఇది వర్తిస్తుంది.
ఇప్పటికే అమలు చేస్తున్న కేంద్రం...
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా దేశవ్యాప్తంగా 30 నుంచి 35 లక్షల మంది లాక్డౌన్లో ఉద్యోగాలు కోల్పోయిన బాధితులకు లబ్ది చేకూరనుందని ఈఎస్ఐ కార్పోరేషన్ సభ్యుడు రాధాకృష్ణన్ తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకంలో పలు మార్పులతో ఈ నిరుద్యోగ భత్యం అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ప్రస్తుతం అమల్లో ఉన్న పథకంలో రోజువారీ వేతనంలో 25 శాతం మొత్తాన్ని నాలుగు నెలల పాటు లెక్కించి ఉద్యోగం కోల్పోయిన 90 రోజుల్లోగా ఒకేసారి చెల్లిస్తున్నారు. దీన్ని ఇప్పుడు 50 శాతానికి పెంచి నిరుద్యోగ భత్యాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకాన్ని కూడా మరో ఏడాది పెంచుతూ అంటే జూన్ 30, 2021 వరకూ పెంచుతూ ఈఎస్ఐ తాజాగా నిర్ణయం తీసుకుంది.