scrappage policy: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు !!
scrappage policy: బస్సుల్లో ప్రయాణం చేస్తూ, అవి చేసే శబ్దాలను భరిస్తూ కూర్చోవడం దాదాపు అందరికీ అనుభవమే. ఇటువంటి కష్టాలకు త్వరలోనే పరిష్కారం దొరకనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మోటారు వాహన చట్టం సవరణలో భాగంగా.. 15 ఏళ్ల పాత వాహనాలను తుక్కుగా మార్చనున్నారు. ఈ మేరకు ఇప్పటికే రోడ్డు రవాణా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదేశాలు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ రద్దు:
కేంద్ర మోటారు వాహన చట్టంలోని నూతన నిబంధనల ప్రకారం.. 15 ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చడం తప్పనిసరి. వాటి రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ గా రద్దవుతుంది. అవి రోడ్లపై తిరగడానికి వీలు లేదు. ప్రభుత్వం ద్వారా నమోదు కాబడిన స్క్రాప్ సెంటర్ల ద్వారా వాటిని వినియోగం నుంచి తప్పించాల్సి ఉంటుంది. పాత వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడానికి మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్మీ వాహనాలకు మినహాయింపు:
కేంద్రం, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వాల అధీనంలోని సంస్థలన్నిటికీ.. స్క్రాపేజ్ నిబంధనలు వర్తిస్తాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గతేడాది నవంబర్ లోనే ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం కోరింది. గ్రీన్ సిగ్నల్ రావడంతో తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్మీ వాహనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
ప్రైవేట్ వాహనాల పరిస్థితేంటి ?
ప్రైవేట్ కార్లు, మోటారు వాహనాలకు ఈ స్క్రాప్ పాలసీ ప్రస్తుతం తప్పనిసరైతే కాదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ 15 ఏళ్ల వాహనాన్ని సంబంధిత అధీకృత సంస్థకు తుక్కుగా అందించినట్లయితే.. నిబంధనల ప్రకారం ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.